దేశ రాజకీయాల్ని మార్చేస్తాం: పంజాబ్ ఫలితాల అనంతరం కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-03-10T21:48:37+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి కాబోతున్న నా తమ్ముడు భగవంత్ మాన్‌కు శుభాకాంక్షలు. ఆప్ ఇప్పటికే 90 స్థానాలు దాటింది. ఫలితాలు ఇంకా రాబోతున్నాయి. సీట్లు ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. పంజాబ్ ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం..

దేశ రాజకీయాల్ని మార్చేస్తాం: పంజాబ్ ఫలితాల అనంతరం కేజ్రీవాల్

చండీగఢ్: రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్ని మార్చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఘన విజయం సాధించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న భగవంత్‌ మాన్‌ను శుభాకాంక్షలు చెబుతూ.. పంజాబీ ఓటర్లు తమపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.


‘‘పంజాబ్ ముఖ్యమంత్రి కాబోతున్న నా తమ్ముడు భగవంత్ మాన్‌కు శుభాకాంక్షలు. ఆప్ ఇప్పటికే 90 స్థానాలు దాటింది. ఫలితాలు ఇంకా రాబోతున్నాయి. సీట్లు ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. పంజాబ్ ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. వారి నమ్మకాన్ని వమ్ము చేయము. ఇదే స్ఫూర్తితో దేశ రాజకీయాల్లో మార్పులు తీసుకువస్తాం’’ అని కేజ్రీవాల్ అన్నారు.


పంజాబ్‌లో ఆప్ ఘన విజయం సాధించింది. ఎన్నికల సంఘం విడుదల చేస్తున్న ఫలితాల ప్రకారం.. ఆప్ ఇప్పటికే 60 సీట్లలో విజయాన్ని ఖాయం చేసుకుని మరో 32 స్థానాల్లో విజయం వైపు పయనిస్తోంది. ఇక ఓట్ షేరింగ్‌లోనూ ఆప్ సంచలన విజయాన్ని సాధించింది. 42.1 శాతం ఓటింగ్‌ సాధించి అధికార కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలను వెనక్కి నెట్టి వేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సైతం దాటి ఆప్ అత్యధిక సీట్లు గెలుచుకుంది. దీంతో పంజాబ్, ఢిల్లీలోని ఆప్ కార్యాలయాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.

Updated Date - 2022-03-10T21:48:37+05:30 IST