చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతా: ఎంపీ కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2022-03-22T21:47:27+05:30 IST

తాను చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి

చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతా: ఎంపీ కోమటిరెడ్డి

ఢిల్లీ: తాను చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియాతో ఆయన ఇక్కడ మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలపైన ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత విభేదాలనేవి మొగుడు పెళ్లాల మధ్య ఉన్న గొడవ లాంటివని ఆయన అభివర్ణించారు. అన్ని అంశాలు సర్దుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ప్రధానిని కలిసినంత మాత్రాన పార్టీ మారతాను అనడానికి సంకేతం కాదన్నారు. తాను చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానన్నారు. సీఎం కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకే ప్రధానిని కలిసానని, భవిష్యత్తులోను ప్రధానిని కలుస్తానని ఆయన స్పష్టం చేశారు.


సరైన సమయంలో రైతుల పంటలను కొనుగోలు చేసి రైతులకు బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఎకరానికి పదివేల పెట్టుబడి పెరిగిందన్నారు. బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. పంట ధాన్యం కొనుగోలు చేతకాకపోతే కేసీఆర్ తప్పుకోవాలన్నారు. కేసీఆర్‌కు ధాన్యం కొనుగోలు చేయడం చేతగాకపోతే నాకు, రేవంత్ రెడ్డికి అప్పచెబితే మద్ధతు ధరతో కొనుగోలు చేసి చూపిస్తామని ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే చత్తీస్‌గడ్‌లోలా క్వింటాకు రూ.2500 ఇస్తామన్నారు. కేసీఆర్‌కి తన అభివృద్ధి మాత్రమే ముఖ్యమని ఆయన ఆరోపించారు. 3 వేల కోట్లు కేటాయించి మూసీ ప్రక్షాళన చేయాలని ప్రధానిని కోరానని ఆయన తెలిపారు. తెలంగాణలో వరిధాన్యానికి మద్దతు ధర పెంచాలని కేసీఆర్‌ను ఆయన డిమాండ్ చేశారు. చత్తీస్‌ఘడ్‌లో తమ కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతు బంధు పథకం వల్ల రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగదన్నారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిది ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమన్నారు. 

ప్రగతి భవన్‌లో విభేదాల గురించి మీడియా రాయదన్నారు. కాంగ్రెస్‌కు సొంత మీడియా, డబ్బులు లేవు కాబట్టే వ్యతిరేకంగా రాస్తారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పనుల కోసం ప్రధానిని, కేంద్ర మంత్రులను గతంలో కలిసాను, భవిష్యత్తులో కూడా కలుస్తాననని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2022-03-22T21:47:27+05:30 IST