న్యాయమడిగితే అక్రమ కేసులు పెడతారా?

ABN , First Publish Date - 2021-07-24T06:22:34+05:30 IST

భూములు అప్పగించాలని న్యాయమడిగితే, కేసులు పెట్టారంటూ మరాఠీపురం ఎస్టీకాలనీకి చెందిన షికారీలు ధర్నా చేశారు.

న్యాయమడిగితే అక్రమ కేసులు పెడతారా?
ఏర్పేడు మూడురోడ్ల కూడలి వద్ద ధర్నా చేస్తున్న షికారీలు

ఏర్పేడు, జూలై 23: కబ్జాకు గురైన భూములు అప్పగించాలని న్యాయమడిగితే, తమపైనే కేసులు పెట్టారని మండలంలోని చింతలపాళెం పంచాయతీ మరాఠీపురం ఎస్టీకాలనీకి చెందిన షికారీలు మండిపడ్డారు. శుక్రవారం ఏర్పేడు మూడు రోడ్ల కూడలి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మరాఠీపురం షికారీల ఉద్యమ నేత పరశునాథ్‌ మాట్లాడుతూ.. మరాఠీపురానికి చెందిన వంద షికారీ కుటుంబాలకు 1972లో ప్రభుత్వం 500 ఎకరాల భూములు పంపిణీ చేసిందన్నారు. కాగా, సంచారజీవులైన షికారీల భూములను చింతలపాళెంకు చెందిన భూస్వాములు కబ్జా చేసి బోగస్‌ పట్టాలు పొందారని ఆరోపించారు. దీంతో న్యాయం చేయాలని ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు షికారీలతో చింతలపాళెం భూస్వాములు తనపైనా అక్రమ కేసులు పెట్టించారని వాపోయారు. అప్పటి నుంచి అధికారులు షికారీలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు పెట్టిన నెల్లూరు జిల్లా షికారీలు, వెనుకుండి నడిపిస్తన్న భూస్వాములపై చర్యలు తీసుకోవాలనీ, లేదంటే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీహరి సంఘటనా స్థలానికి చేరుకుని, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో షికారీలు ధర్నా విరమించారు. 

Updated Date - 2021-07-24T06:22:34+05:30 IST