INS vikrant: చైనా ఊసెత్తే ధైర్యం మోదీ చేస్తారా?: ఒవైసీ
ABN , First Publish Date - 2022-09-03T01:14:35+05:30 IST
స్వదేశీ డిజైన్తో నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను భారత నావికాదళానికి...
న్యూఢిల్లీ: స్వదేశీ డిజైన్తో నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant)ను భారత నావికాదళానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు అప్పగించడంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించారు. ఇప్పడైనా చైనా గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ధైర్యంగా (Courgage) మాట్లాడతారా? అని ప్రశ్నించారు.
''మన భూభాగంలోని 10 గ్రామాలను ఆక్రమించిన చైనా గురించి ఇప్పటికైనా ప్రధాని ధైర్యంగా మాట్లాడతారని అనుకుంటున్నాను. ఐఎన్ఎస్ విక్రాంత్ రాకతోనైనా ఆయన పార్లమెంటులో చైనా పేరు ధైర్యంగా ప్రస్తావిస్తారని అశిస్తున్నాను'' అని ఒవైసీ అన్నారు. ''ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభించినప్పుడు, థర్డ్ కెరీర్ ఎయిర్క్రాఫ్ట్ మనకు అవసరమని అంతా అనుకున్నాం. కానీ ఆయన (మోదీ) అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన ధ్వంసం చేశారు. డబ్బులు లేవు. మనకు 200 షిప్పులు అవసరం. 130 మాత్రమే ఉన్నాయి'' అని ఆయన చెప్పారు.
కాగా, ఐఎన్ఎస్ విక్రాంత్ను రూ.20,000 కోట్లతో నిర్మించారు. ఈ నౌక నుంచి విమానాలు బయల్దేరడానికి 262 మీటర్ల పొడవు, 62.4 మీటర్ల వెడల్పుగల ఫ్లయింగ్ డెక్ ఉంది. మన దేశంలోని ప్రధాన పరిశ్రమలు, 100 ఎంఎస్ఎంఈలు సరఫరా చేసిన మెషినరీతో ఈ నౌకను నిర్మించారు. దీంతో అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ సరసన భారత దేశం కూడా చేరింది. ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధ యంత్రం కాదనీ, భారత దేశ నైపుణ్యం, ప్రతిభలకు ఇది నిలువెత్తు నిదర్శనమని, చాలా ప్రత్యేకమైనదని కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రశంసలు కురిపించారు.