కాల్‌డేటా వచ్చాక వారి అంతు తేలుస్తా

ABN , First Publish Date - 2022-06-29T08:04:27+05:30 IST

కాల్‌డేటా వచ్చాక వారి అంతు తేలుస్తా

కాల్‌డేటా వచ్చాక వారి అంతు తేలుస్తా

మా నేత తప్పు తెలుసుకోవాలి

ఇలాగే వ్యవహరిస్తే కాళ్లు విరగ్గొడతా

మాజీ మంత్రి బాలినేని హెచ్చరిక


ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 28: ‘కాల్‌డేటా తెప్పిస్తున్నా.. అది వచ్చిన తర్వాత వారి అంతు తేలుస్తా.. ఇప్పటికైనా మా పార్టీ నేత తన తప్పు తెలుసుకోవాలి. ఇదేవిధంగా వ్యవహరిస్తే కాళ్లు విరగ్గొట్టేందుకు కూడా వెనుకాడేది లేదు’ అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. సొంత పార్టీ అగ్ర నేత టీడీపీ నేతలతో కలిసి తనపై కుట్ర చేస్తున్నానని సోమవారం ఆరోపించిన ఆయన.. మంగళవారం కూడా విమర్శలు గుప్పించారు. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల వైసీపీ సమన్వయకర్త అయిన బాలినేని.. ఇక్కడి ఏ-1 కన్వెన్షన్‌ హాలులో జరిగిన ఒంగోలు నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి తప్పూ చేయకపోయినా టీడీపీతో కలిసి తనపై దుష్పచారం చేసేందుకు కుట్ర పన్నారని.. నాలుగు అంశాల్లో నిరంతరం దుష్ప్రచారం చేస్తూ మనోవేదనకు గురిచేస్తున్నారని వాపోయారు. ‘నేను కూడా ఉప్పూ కారం తింటున్నాను. ఇక  ఓపిక నశించిపోయింది. ఈ విధానాలను మానుకోకపోతే నేనేమిటో చూపిస్తా. అల్లూరుకు చెందిన కవితారెడ్డి అనే మహిళ ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఆ గ్రామంలో గడపగడప కార్యక్రమానికి వెళ్లిన రోజునే టీడీపీ నేతలతో కలిసి అక్కడకు వచ్చింది. గొడవ చేసేందుకు ప్రయత్నిస్తుందని నాకు ముందుగానే సమాచారం ఉంది. అయినా నేను పట్టించుకోలేదు. ఆమె కుటుంబ వ్యవహారాలను నాపై రుద్దేందుకు మా పార్టీలోని ఒక వ్యక్తితో కలిసి టీడీపీ వారు ఇటువంటి కుట్రలు చేశారు. జనసేనకు చెందిన మహిళా నేతకు నేను మద్యం తాగి ఫోన్‌ చేసినట్లు ప్రచారం చేశారు. నేను టీ, కాఫీలే తాగను. పవన్‌ కల్యాణ్‌ అడిగారని వెంటనే కేసు ఉపసంహరించుకున్నాం. నేను తప్పు చేసినట్లు చూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటా. బాలినేని మంచోడే.. వాళ్ల అబ్బాయి కాదని మాట్లాడుతున్నారు. నా కుమారుడు ఏం తప్పు చేశాడో ఒక్కటైనా చూపించగలరా? నాపై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాం. కవిత తో నిరంతరం టచ్‌లో ఉన్న వారి కాల్‌డేటాను తెప్పించి సీఎం జగన్‌కు ఫిర్యాదు చేస్తా’ అని వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని బాలినేని అన్నారు.

Updated Date - 2022-06-29T08:04:27+05:30 IST