సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మిన డబ్బు తెలంగాణకు వినియోగిస్తారా?: కవిత
ABN , First Publish Date - 2022-05-19T09:02:00+05:30 IST
ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తోందని, దాన్ని అమ్మితే వచ్చే డబ్బును తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తారా? అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ఒక ప్రకటనలో బీజేపీ నేతలను ప్రశ్నించారు.
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తోందని, దాన్ని అమ్మితే వచ్చే డబ్బును తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తారా? అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ఒక ప్రకటనలో బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రాన్ని అడిగే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా? అని అడిగారు. తెలంగాణలో ఏదైనా కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నారా? లేదా కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయబోతున్నారా? కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నో కుటుంబాలు ఆధారపడ్డ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ వంటి ఫ్యాక్టరీలను మూసివేసి కేంద్రం ప్రజలకు ఏమి సమాధానం చెబుతుందని నిలదీశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రాంతీయ పార్టీలకు నిర్దిష్ట ఎజెండా ఉందని, రాహుల్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారం ఉన్నది కూడా ఒక ప్రాంతీయ పార్టీ మద్దతుతోనే అన్న విషయం మరిచిపోరాదన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక తోక పార్టీగా మారిందని విమర్శించారు. వచ్చే రోజుల్లో దేశవ్యాప్తం గా కాంగ్రెస్ తోక పార్టీగా మిగులుతుందని ఎద్దేవాచేశారు.