సాగర్లో నీటి సమస్య పరిష్కరించరా?
ABN , First Publish Date - 2022-05-19T06:42:52+05:30 IST
నందికొండ(నాగార్జునసాగర్) మునిసిపాలిటీ అభివృద్ధికి ఇటీవల మంత్రి కేటీఆర్ కోట్లాది రూపాయలు మంజూరు చేసినా వార్డులో తాగునీటి సమస్య పరిష్కరించడం లేదని ఐదో వార్డు మహిళలు మహిళలు ఆవేదన నిలదీశారు.
కౌన్సిలర్ ఇంటి ఎదుట మహిళల ధర్నా
ఖాళీ బిందెలతో మహిళల నినాదాలు
కోట్లాది రూపాయల నిధులు మంజూరైనా ఇక్కట్లేనా
నాగార్జునసాగర్, మే 18: నందికొండ(నాగార్జునసాగర్) మునిసిపాలిటీ అభివృద్ధికి ఇటీవల మంత్రి కేటీఆర్ కోట్లాది రూపాయలు మంజూరు చేసినా వార్డులో తాగునీటి సమస్య పరిష్కరించడం లేదని ఐదో వార్డు మహిళలు మహిళలు ఆవేదన నిలదీశారు. వార్డులో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక కౌన్సిలర్(టీఆర్ఎస్) ఇంటి ఎదుట ఖాళీ బిందెలతో బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వారం రోజులుగా తాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గరే కృష్ణానది ఉన్నా కనీసం తాగునీరు కూడా రాకుంటే వేసవి కాలంలో ఎలా బతకాలని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్లో ఉన్న కాలనీలోని ఇళ్లకు కనీసం తాగునీరు సరఫరా చేయకుండా 150కిలో మీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్కు తాగునీటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నీటిని తరలిస్తున్నారని వాపోయారు. నందికొండ మునిసిపాలిటీ అభివృద్ధిలో భాగంగా తాగునీరు, అంతర్గ రోడ్లు ఇతర పనులకు రూ.28కోట్ల మంజూరు చేశామని మంత్రి కేటీఆర్ ఈ నెల 14వ తేదీన సాగర్లో జరిగిన సభలో ప్రకటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని, కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వకపోవడం ఏమిటని కౌన్సిలర్ను ప్రశ్నించారు. దీనిపై కౌన్సిలర్ రమేష్జీ మాట్లాడుతూ ఎన్ఎస్పీ పరిధిలో నుంచి నందికొండ మునిసిపాలిటీగా ఏర్పడిన సాగర్ హిల్కాలనీలో ఇళ్లకు నీటి సరఫరా చేసే విభాగం మునిసిపాలీటీ పరిఽధిలోకి రాలేదన్నారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే భగత్, మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని, తాగునీటి సరఫరా విభాగం మునిసిపాలిటీ పరిధిలో లేదని తెలిపారు. ఒక వేళ పనులు చేపట్టినా నిధులు ఇవ్వలేమని కమిషనర్ తెలిపారని సమాధానమిచ్చారు. అరగంటసేపు ఆందోళన చేసిన మహిళలు అక్కడినుంచి వెళ్లిపోయారు.