ఉప్పర్పల్లిలో మహిళా భవనం పూర్తయ్యేనా?
ABN , First Publish Date - 2022-08-08T05:01:09+05:30 IST
అధికారుల అలసత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఫలితంగా దౌల్తాబాద్ మండలంలోని ఉప్పర్పల్లి గ్రామంలో మహిళా భవనం పూర్తికావడం లేదు.
9 ఏళ్లుగా గోడలకే పరిమితమైన పనులు
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
దౌల్తాబాద్, ఆగస్టు 7: అధికారుల అలసత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఫలితంగా దౌల్తాబాద్ మండలంలోని ఉప్పర్పల్లి గ్రామంలో మహిళా భవనం పూర్తికావడం లేదు. ఈ గ్రామంలో 9 ఏళ్ల క్రితం రూ.10 లక్షలతో మహిళా భవనం నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. మొదట్లో పనులు ముమ్మరంగా జరిగాయి. ప్రస్తుతం ఫిల్లర్ల స్థాయి నుంచి శ్లాబ్ లెవల్ పనులను పూర్తిచేశారు. అప్పటినుంచి నేటివరకు మహిళా భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. తొందరగా పూర్తిచేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు గ్రామస్థులు విన్నవించినా ఫలితం లేకుండాపోయింది. మహిళా సంఘానికి పక్కా భవనం లేకపోవడంతో గ్రామ మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.