‘పోస్టు’ పెడితే వేధిస్తారా!

ABN , First Publish Date - 2022-07-04T08:24:18+05:30 IST

‘పోస్టు’ పెడితే వేధిస్తారా!

‘పోస్టు’ పెడితే వేధిస్తారా!

అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి భయభ్రాంతులకు గురిచేస్తారా?

సీఐడీ అధికారులపై చర్య తీసుకోండి.. డీజీపీకి చంద్రబాబు లేఖ 


అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ అధికారుల వేధింపులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కళంకితమైన అధికారుల సహకారంతో ప్రతిపక్షాలను ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురి చేస్తోందని, టీడీపీ శ్రేణులపై బెదిరింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. సీఐడీ వేధింపులను ఖండిస్తూ, ఇటీవల జరిగిన పలు ఘటనలను ఉటంకిస్తూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. ‘‘అమరావతి మండలం ధరణికోటకు చెందిన గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావును అక్రమంగా సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి గోడలు దూకి, తలుపులు పగలగొట్టి, నోటీసుల పేరుతో వేధింపులకు గురి చేశారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్న సమయంలో అక్రమంగా చొరబడి భయభ్రాంతులకు గురి చేశారు.


అక్రమంగా కస్టడీలోకి తీసుకుని, వారిని తీవ్రంగా వేధించారు. గంటల తరబడి స్టేషన్‌లో బట్టలు లేకుండా కూర్చోబెట్టి, దాడికి పాల్పడ్డారు. విచారణ గదిలో ఎటువంటి సీసీ కెమేరాలు లేవు. అరెస్టు చేసిన సమయంలో, విచారణ సమయంలో సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా సీఐడీ పోలీసులు వ్యవహరించారు. నేరపూరితమైన కుట్రలకు పాల్పడిన ఆ అధికారులపై చర్యలు తీసుకుని, బాధితులకు అండగా నిలబడాలి’’ అని కోరారు. సీఐడీ పోలీసులు చేసిన దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలను డీజీపీకి రాసిన లేఖకు చంద్రబాబు జత చేశారు.


Updated Date - 2022-07-04T08:24:18+05:30 IST