విప్రో, ఇన్ఫోసిస్ ఇంత పని చేశాయా..? వందల మంది ఫ్రెషర్లకు భారీ షాక్..!

ABN , First Publish Date - 2022-10-04T00:23:21+05:30 IST

ప్రముఖ ఐటీ సంస్థలు కొన్ని.. ఫ్రెషర్లకు(Freshers) ఊహించని షాకిచ్చినట్టు తెలుస్తోంది.

విప్రో, ఇన్ఫోసిస్ ఇంత పని చేశాయా..? వందల మంది ఫ్రెషర్లకు భారీ షాక్..!

ముంబై: కొన్ని ప్రముఖ ఐటీ సంస్థలు ఫ్రెషర్స్‌కు(Freshers) ఊహించని షాకిచ్చినట్టు తెలుస్తోంది. వారికి గతంలో ఇచ్చిన ఆఫర్ లెటర్లను(Offer letters) రద్దు చేసినట్టు సమాచారం. విప్రో(Wipro), ఇన్ఫోసిస్(Infosys), టెక్ మహీంద్రా(Tech Mahindra) సంస్థలు ఇలా ఆఫర్ లెటర్లను రద్దు చేసినట్టు జాతీయ మీడియాలో ఓ వార్త సంచలనంగా మారింది. ఇలా వందల మందికి ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం కలకలం రేపుతోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సుమారు మూడు నాలుగు నెలల క్రితం ఉద్యోగార్థులకు.. ఈ సంస్థలు ఆఫర్ లెటర్లు పంపాయట. అయితే.. ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌లో జాప్యం జరగడంతో వారు ఉద్యోగంలో చేరలేకపోయారు. ఆఫీసులకు రమ్మంటూ త్వరలోనే కంపెనీల నుంచి కబురొస్తుందని అనుకుంటున్న తరుణంలో..  వారికి తగిన విద్యార్హతలు లేని కారణంగా ఉద్యోగం ఇవ్వడం కుదరదంటూ కంపెనీల నుంచి లేఖలు అందాయట. ‘‘కంపెనీ నిబంధనల ప్రకారం.. మీకు తగిన అర్హతలు లేవు’’ అని కంపెనీలు పేర్కొన్నట్టు సమాచారం.


ప్రపంచవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి నెమ్మదిస్తోందన్న సంకేతాల నడుమ.. అనేక టెక్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాల నిర్ణయం సంచలనంగా మారింది. ఐటీ రంగ నిపుణుల ప్రకారం.. టెక్ రంగంలో ప్రస్తుతం నిధుల కొరత నెలకొంది. ముఖ్యంగా ఐటీ స్టార్టప్ కంపెనీలు డబ్బుల కొరత ఎదుర్కొంటున్నాయి. అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడంతో.. మార్కెట్‌లో నిధుల లభ్యతకు కటకట ఏర్పడింది. స్టార్టప్ సంస్థలతో పాటూ టెక్ రంగంలోని దిగ్గజాలను కూడా ఈ పరిణామాలు ఒడిదుడుకుల పాలు చేస్తున్నాయి. దీంతో.. అనేక కంపెనీలు కొత్తగా నియామకాలు చేపట్టేందుకు వెనకడుగు వేస్తున్నాయి. దిగ్గజ సంస్థలైన గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ కూడా కొత్త వారిని నియమించుకోబోమని ఇప్పటికే చెప్పేశాయి. అంతేకాకుండా.. సంస్థలో అందుబాటులో ఉన్న వనరులతోనే ఉత్పాదకత పెంచేందుకు నిర్ణయించాయి. 

Updated Date - 2022-10-04T00:23:21+05:30 IST