కత్తులు, కొడవళ్లతో.. పొడిచి పొడిచి.. నరికి నరికి..
ABN , First Publish Date - 2022-08-16T09:42:26+05:30 IST
టీఆర్ఎస్ నాయకుడు, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య(60) దారుణహత్యకు గురయ్యారు.
తుమ్మల అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణహత్య
30కి పైగా కత్తిపోట్లతో తూట్లు పడ్డ చేతులు, ముఖం
ఆగస్టు 15 వేడుకల నుంచి వెళ్తుండగా దారికాచి దాడి
ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో దారుణం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావే చంపించారంటూ పోలీసులకు ఫిర్యాదు
వీరభద్రం, కోటేశ్వరరావు ఇళ్లపై దాడి
ఖమ్మం/ఖమ్మం రూరల్ ఆగస్టు15 (ఆంధ్రజ్యోతి): టీఆర్ఎస్ నాయకుడు, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య(60) దారుణహత్యకు గురయ్యారు. ఖమ్మంరూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన ఆయన సోమవారం అదే మండలంలోని పొన్నెకల్ రైతువేదిక వద్ద జరిగిన పంద్రాగస్టు వేడుకలకు హాజరయ్యారు. జెండా ఎగురవేసి, తన ప్రధాన అనుచరుడైన ముత్తేశంతో కలిసి తిరిగి ఇంటికి వస్తుండగా.. తెల్దారుపల్లి దోబీఘాట్ వద్ద ఆటోలో మాటువేసిన ప్రత్యర్థులు పథకం ప్రకారం ఆయన ద్విచక్రవాహనాన్నిఢీకొట్టారు. దీంతో ద్విచక్రవాహనం నడుపుతున్న ముత్తేశంతోపాటు వెనకకూర్చున్న కృష్ణయ్య రోడ్డు పక్కనే ఉన్న కాలవలో పడిపోయారు.
అంతే.. ఆటోలోని ఆరుగురు వ్యక్తులూ కత్తులు, వేట కొడవళ్లతో కృష్ణయ్యపై దాడి చేశారు. ఆయన మెడపై, ఛాతీమీద, ఛాతీ పక్కభాగంలో.. ఇలా ఎక్కడపడితే అక్కడ విచక్షణరహితంగా కత్తులతో పోడిచారు. కొడవళ్లతో నరికారు. ప్రాణభయంతో ఆయన చేతులు అడ్డుపెట్టే ప్రయత్నం చేయడంతో రెండు చేతులనూ కొడవళ్లతో కోసేశారు. ఆ తర్వాత కళ్లలో కత్తులతో పొడిచి అత్యం త పాశవికంగా ప్రాణాలు బలిగొన్నారు. కృష్ణయ్య శరీరంపై మొత్తం 30కిపైగా కత్తిపోట్లున్నాయంటే ప్రత్యర్థులు ఆయన్ను ఎంత కిరాతకంగా హత్యచేశారో అర్థం చేసుకోవచ్చు. కృష్ణయ్య నివాసానికి 100 మీటర్ల దూరంలోనే ఈ హత్య జరిగింది. ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిన ముత్తేశం లేచి చూసేసరికి.. ప్రత్యర్థులు కృష్ణయ్యపై దారుణంగా దాడి చేస్తున్నారు. ముత్తేశం పెద్దగా కేకలు వేసినా ప్రయోజనం లేకపోయింది. కృష్ణయ్యను చంపేసిన అనంతరం దుండగులు వచ్చిన ఆటోలోనే పరాయర్యారు. ఉదయం 11 గంటలకు జరిగిన ఈ దారుణంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. కాగా.. కృష్ణయ్య అంత్యక్రియలు మంగళవారం ఆయన స్వగ్రామంలో నిర్వహించనున్నారు.