కేసీఆర్ త్వరలో తీసుకోనున్న నిర్ణయంతో.. ఇండియా అంతా దుమ్ము రేగాలి
ABN , First Publish Date - 2022-10-03T09:44:06+05:30 IST
కరీంనగర్లో నిర్వహించిన కేసీఆర్ సింహగర్జనతోపాటు ఆమరణ నిరాహార దీక్ష విజయవంతమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
- ఎరుపు, తెలుపు రంగులు కలిసి గులాబీ జెండా అయింది
- ఎర్రజెండా కోరుకునే పనులన్నీ కేసీఆర్ చేస్తున్నారు: కేటీఆర్
కరీంనగర్ కల్చరల్, అక్టోబరు 2: కరీంనగర్లో నిర్వహించిన కేసీఆర్ సింహగర్జనతోపాటు ఆమరణ నిరాహార దీక్ష విజయవంతమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలే అందరినీ ప్రభావితం చేస్తున్నాయని, ఈ దిశగా సీఎం కేసీఆర్ త్వరలో తీసుకోనున్న నిర్ణయం ఇండియా అంతటా అలాగే దుమ్మురేగాలని అన్నారు. కరీంనగర్లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కళోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో ఎరుపు, తెలుపు రంగులు కలిసి గులాబీ జెండా అయిందన్నారు. ఎర్రజెండా కోరుకునే పనులన్నీ సీఎం కేసీఆర్ చేస్తున్నారని, కాబట్టి గతంలో ఎర్రజెండా ఎత్తుకున్న సోదర సోదరీమణులు ఇప్పుడు కేసీఆర్ బాటలో నడుస్తున్నారని చెప్పారు.