ఓటు వేయలేదని పింఛన్ల నిలిపివేత

ABN , First Publish Date - 2021-03-07T05:12:57+05:30 IST

అధికార పార్టీ మద్దతు అభ్యర్థికి ఓటు వేయలేదని తమ పింఛన్లు నిలిపివేశారంటూ పెదపథం, బాగువలస గ్రామాలకు చెందిన పలువురు సాలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం బైఠాయించారు.

ఓటు వేయలేదని పింఛన్ల నిలిపివేత
ఎంపీడీవో కార్యాలయం వద్ద బైఠాయించిన పింఛన్‌దారులు

  ఆందోళన చేపట్టిన బాధితులు

సాలూరు రూరల్‌, మార్చి 6: అధికార పార్టీ మద్దతు అభ్యర్థికి ఓటు వేయలేదని తమ పింఛన్లు నిలిపివేశారంటూ పెదపథం, బాగువలస గ్రామాలకు చెందిన పలువురు సాలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం బైఠాయించారు. సీపీఎం నేత మర్రి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు చెందిన పెదపథం పైడియ్య, లక్ష్మణరావు, దాలయ్య, లక్ష్మణ, కొమ్మ గంగయ్య, అప్పన్నలు నిరసన తెలిపారు. పంచాయతీ ఎన్నికల ముందు  ఇద్దరు వలంటీర్లు తమపై ఓటు కోసం ఒత్తిడి తెచ్చారని, అనంతరం తమ పింఛన్లు నిలిపివేశారని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తే వారికే కొమ్ము కాశారని ఆరోపించారు. వారిపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీడీవో గొల్లపల్లి పార్వతికి వినతిపత్రం అందించారు. సీపీఎం నేత మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓటు వేయకుంటే పింఛన్లు నిలిపివేయడం దారుణమన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ఎంపీడీవో స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ దీనిపై విచారణ చేపట్టి, వచ్చిన నివేదిక మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

 

Updated Date - 2021-03-07T05:12:57+05:30 IST