కొడుకు Hyderabad లో.. కూతుళ్లు America లో.. ఎడబాటు భరించలేక తల్లి కఠిన నిర్ణయం!

ABN , First Publish Date - 2022-05-21T15:53:22+05:30 IST

ఒంటిమీద బంగారు ఆభరణాలను ధరించింది.. ఆస్తి డాక్యుమెంట్లు, ఆధార్‌, బ్యాంక్‌ పాసు పుస్తకాలు పక్కనే ఉంచుకుంది.. అనంతరం కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఓ గృహిణి.

కొడుకు Hyderabad లో.. కూతుళ్లు America లో.. ఎడబాటు భరించలేక తల్లి కఠిన నిర్ణయం!

నరసరావుపేట లీగల్‌, మే20: ఒంటిమీద బంగారు ఆభరణాలను ధరించింది.. ఆస్తి డాక్యుమెంట్లు, ఆధార్‌, బ్యాంక్‌ పాసు పుస్తకాలు పక్కనే ఉంచుకుంది.. అనంతరం కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఓ గృహిణి. ఈ ఘటన పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో రామిరెడ్డిపేటలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. మొదటి పట్టణ సీఐ అశోక్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామానికి చెందిన కోట్ల రామారావు, కుమారి(52) దంపతులు రెండున్నరేళ్ల నుంచి రామిరెడ్డి పేటకు వచ్చి పాత సమితి ఆఫీసు సమీపంలో ఉంటున్నారు. గతంలో రామారావు వ్యాపారం చేసేవాడు. పిల్లలు సెటిల్‌ అవడంతో వ్యాపారం మానివేసి ఇంటివద్దే ఉంటున్నాడు. కొడుకు అనిల్‌కు పెళ్లయింది. భార్యతో కలిసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు కాగా.. కుటుంబాల సహా వారు అమెరికాలో సెటిల్‌ అయ్యారు. ఇటీవలి వరకు పెద్ద కుమార్తె కుమారుడు కుమారి వద్దే ఉన్నాడు. గురువారమే అతనిని కూడా కుమార్తె అమెరికాకు తీసుకెళ్లిందది. 


ఈ నేపథ్యంలో మానసిక ఒత్తిడికి లోనైన కుమారి భర్త బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో గల రూ.7 లక్షలు నగదు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, బ్యాంక్‌ పాసు పుస్తకాలు కుప్పగా పోసి ఇంట్లో గల బంగారు ఆభరణాలను ధరించి సదరు కాగితాలకు నిప్పంటించి తనకు కూడా నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గత రెండు నెలలుగా ఆమె మానసిక ఒత్తిడితో బాధ పడుతున్నట్టు బంధువులు తెలిపారన్నారు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంటికి వెనుక వైపు, ముందు వైపు గడియ పెట్టుకుంది. మంటలు రేగటంతో చుట్టు పక్కల వారు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారని, వారు వచ్చే సరికే కుమారి మృతి చెందిందని ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-21T15:53:22+05:30 IST