బాస్‌పై ఆగ్రహం.. గోదామును తగలెట్టేసిన కార్మికురాలు.. రూ. 9 కోట్ల నష్టం

ABN , First Publish Date - 2021-12-12T01:33:25+05:30 IST

తనపై నిత్యం ఏదోక ఫిర్యాదు చేస్తూ విసిగిస్తున్న బాస్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన కార్మికురాలు అనూహ్య నిర్ణయం తీసుకుంది. బాస్‌పై ప్రతీకారంగా సంస్థకు చెందిన ఓ గౌడన్‌కు నిప్పు పెట్టేసింది.

బాస్‌పై ఆగ్రహం..  గోదామును తగలెట్టేసిన కార్మికురాలు.. రూ. 9 కోట్ల నష్టం

బ్యాంకాక్: తనపై నిత్యం ఏదోక ఫిర్యాదు చేస్తూ విసిగిస్తున్న బాస్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన కార్మికురాలు అనూహ్య నిర్ణయం తీసుకుంది. బాస్‌పై ప్రతీకారంగా సంస్థకు చెందిన ఓ గోదాముకు నిప్పు పెట్టేసింది. మంటల్లో పడి గోడౌన్ దగ్ధమైపోవడంతో ఆ సంస్థకు ఏకంగా 9 కోట్ల రూపాయల(మన కరెన్సీ ప్రకారం..) నష్టం వచ్చింది. థాయ్‌ల్యాండ్‌కు చెందిన చమురు ఉత్పత్తుల సంస్థ ప్రపాకాన్ ఆయిల్‌లో ఇటీవల ఈ దారుణం జరిగింది. ఘటన జరిగిన సమయంలో గోదాములో చమురు ఉత్పత్తులతో నిండిని వందల కొద్దీ ట్యాంకులు ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఈ దావానలం కారణంగా సమీపంలో ఉన్న 10 ఇళ్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. గోదాము సమీపంలోనే ఓ కాలవ ఉండటంతో...ఈ మండుతున్న ఆయిల్ ఉత్పత్తులు నిటిలో తేలుతూ ఇతర ప్రాంతాలకు పాకుతాయేమోనని స్థానికులు కంగారు పడిపోయారు. అయితే.. అప్పటికే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది తగు చర్యలు చేపట్టి ప్రమాదాన్ని నివారించారు. 


నిందితురాలు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. తన పనీతీరు విషయంలో పైఅధికారి నిత్యం అసంతృప్తి వ్యక్తం చేస్తూ విసిగిస్తుండటంతో ఇలా చేశానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే.. ప్రమాదం ఈ స్థాయిలో ఉంటుందని తాను ఊహించలేదని ఆమె పోలీసులతో చెప్పినట్టు సమాచారం. తొమ్మిదేళ్లుగా నిందితురాలు అదే సంస్థలో పనిచేస్తోంది. అయితే.. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మండుతున్న చిన్న కాగితాన్ని చేతపట్టుకుని ఆమె గోదాములోకి వెళుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైయ్యాయి. 

Updated Date - 2021-12-12T01:33:25+05:30 IST