రైలు కోచ్లో యువతి మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2021-11-15T15:57:44+05:30 IST
గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్లో రైలు కోచ్లో వేలాడుతున్న 18 ఏళ్ల యువతి మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వడోదర: గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్లో రైలు కోచ్లో వేలాడుతున్న 18 ఏళ్ల యువతి మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఆఫీసు నుంచి హాస్టల్ కు తిరిగి వస్తుండగా యువతి వడోదరలో సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.వడోదరలోని ఓ ఎన్జీవో సంస్థలో పనిచేసిన కాలేజీ విద్యార్థిని మృతదేహం నవంబర్ 4న వల్సాద్లోని గుజరాత్ క్వీన్ ఎక్స్ప్రెస్ కోచ్లో వేలాడుతూ కనిపించడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలు వడోదరలోని హాస్టల్లో నివసించేది.వడోదరలోని ఆటో రిక్షాలో ఇద్దరు నిందితులు కిడ్నాప్ చేసి, ఆమె కళ్లకు గంతలు కట్టి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారని బాధితురాలు డైరీలో పేర్కొంది.
అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని, బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందా లేదా అనే విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకోవాలని అధికారులను ఆదేశించామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్-సీఐడీ (క్రైమ్ అండ్ రైల్వేస్) సుభాష్ త్రివేది విలేకరులకు చెప్పారు.వడోదర సిటీ పోలీసులు, అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, రైల్వే పోలీసుల సిబ్బందితో దాదాపు 25 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, దాదాపు 450 సీసీటీవీ ఫుటేజీలను స్కాన్ చేశామని చెప్పారు.తాము కాల్ డేటా రికార్డులను కూడా పరిశీలిస్తున్నామని, ఎలక్ట్రానిక్ నిఘా, ఇంటెలిజెన్స్ ఇన్పుట్లను ఉపయోగించి నిందితులను పట్టుకుంటామని ఐజీ చెప్పారు.