ఉద్యోగంలో చేరిన తొలిరోజే నర్సుపై సామూహిక అత్యాచారం-హత్య

ABN , First Publish Date - 2022-05-02T02:34:03+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. విధుల్లో చేరిన తొలి రోజే ఓ నర్సు సామూహిక అత్యాచారానికి గురైంది.

ఉద్యోగంలో చేరిన తొలిరోజే నర్సుపై సామూహిక అత్యాచారం-హత్య

ఉన్నావో: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. విధుల్లో చేరిన తొలి రోజే ఓ నర్సు సామూహిక అత్యాచారానికి గురైంది. ఆపై విగతజీవిగా మారింది. ఉన్నావో జిల్లా దుల్లాపూర్వ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. టికానా గ్రామానికి చెందిన 19 ఏళ్ల నజియా శుక్రవారం గ్రామంలోని న్యూ జీవన్ ఆసుపత్రిలో నర్సుగా చేరింది. ఆ తర్వాతి రోజు (శనివారం) ఉదయం బిల్డింగ్ పైనుంచి వేలాడుతున్న ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది గమనించారు. ఆమె మెడచుట్టూ ఉచ్చు బిగించి ఉండగా, ముఖానికి మాస్క్, చేతిలో రుమాలు లాంటిది ఉంది. 

 

నజియా మృతదేహాన్ని చూసిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించారు. శుక్రవారం రాత్రి ఆమె ఆసుపత్రిలోనే నిద్రించిందని, తెల్లవారుజామున ఆమె మృతదేహం ఇలా వేలాడుతూ కనిపించిందని ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు తెలిపారు.


తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం చేసి ఆపై హత్య చేసి వేలాడదీసి ఉంటారని బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న నలుగురిపై సామూహిక అత్యాచారం, హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఆసుపత్రిని  బంగర్‌మౌ ఎమ్మెల్యే శ్రీకాంత్ కతియార్ ఏప్రిల్ 25న ప్రారంభించారు. 

Updated Date - 2022-05-02T02:34:03+05:30 IST