అంబులెన్స్కు అడ్డంగా ఏనుగు.. లోపల గర్భిణీకి నొప్పులు.. ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-04-30T00:28:30+05:30 IST
ఎరొడె, తమిళనాడు : ఓ గర్భవతి ప్రసవవేదన పడుతోంది. పురిటి నొప్పులు ఎక్కువవుతుండడంతో బంధువులు ఆమెను హాస్పిటల్కు తరలించేందుకు అంబులెన్స్ ఎక్కించారు.
ఎరొడె, తమిళనాడు : ఓ గర్భిణీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ప్రసవవేదన ఎక్కువవుతుండడంతో హాస్పిటల్కు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్ ఎక్కించారు. కానీ అంబులెన్స్ కొద్దిదూరం వెళ్లాక మార్గమధ్యంలోనే ఆపివేయాల్సి వచ్చింది. అడవిలోంచి వచ్చిన ఓ ఏనుగు ఘాట్ రోడ్డుకు అడ్డంగా నిలబడింది. ఎంత ప్రయత్నించినా పక్కకి తొలగలేదు. నొప్పులు మరింత పెరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎంతసేపు వేచిచూసినా ఏనుగు రోడ్డు దిగలేదు. అరగంటకుపైగా అంబులెన్స్ను అలాగే ఆపారు. ఆఖరికి నొప్పులు భరించలేక అంబులెన్స్లోనే మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన తమిళనాడులోని ఎరోడె జిల్లాలో గురువారం జరిగింది.
24 ఏళ్ల గిరిజన మహిళకు ఈ పరిస్థితి ఎదురైందని వైద్యాధికారులు వెల్లడించారు. అంబులెన్స్లో గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. అంబులెన్స్లోనే ప్రసవానికి సిబ్బంది ఆమెకు సాయపడ్డారని వైద్యాధికారులు తెలిపారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం జరిగిన కొన్ని నిమిషాల తర్వాత రోడ్డు మీద నుంచి ఏనుగు పక్కకెళ్లింది. దీంతో మహిళను దగ్గరలోని హాస్పిటల్కు చేర్చామని, శిశువుని గ్రామీణ హెల్త్కేర్ సెంటర్కు తరలించామని వెల్లడించారు. ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.