ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
ABN , First Publish Date - 2022-06-29T05:48:23+05:30 IST
ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని నల్లగొండ జిల్లా దేవరకొండ డిపో ఆవరణలో ఓ మహిళ మృతిచెందింది. బాధితురాలి భర్త అంజయ్య,
దేవరకొండ, జూన్ 28: ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని నల్లగొండ జిల్లా దేవరకొండ డిపో ఆవరణలో ఓ మహిళ మృతిచెందింది. బాధితురాలి భర్త అంజయ్య, ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నేరేడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన బూషరాజు అంజయ్య, మంగమ్మ(40) దంపతులు కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె రాజేశ్వరి, కుమారుడు రమే్షలు ఉండగా, వారికి వివాహాలయ్యాయి. కుమారుడు రమేష్ హైదరాబాద్లో కారు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగమ్మ తల్లి రాములమ్మ అనారోగ్యానికి గురై దేవరకొండలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లిని చూసేందుకు మంగమ్మ తిమ్మాపురం నుంచి ప్రైవేట్ వాహనంలో మంగళవారం దేవరకొండకు వచ్చింది. పని నిమిత్తం బస్టాండ్లోకి వెళ్లిన మంగమ్మ బయటకు వస్తుండగా, దేవరకొండ డిపో నుంచి బస్టాండ్లోకి వస్తున్న టీఎస్05 యూడీ 5903 అద్దె బస్సు డ్రైవర్ ఎస్కె బాబా అతి నిర్లక్ష్యంతో వేగంగా ఆమెను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బస్సు ముందు కుడి టైరు మంగమ్మ మీదుగా వెళ్లడంతో తీవ్ర గాయాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన ప్రయాణికులు కేకలు వేయడంతో బస్సును నిలిపివేసి డ్రైవర్ పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి మంగమ్మ మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ బాబాపై మంగమ్మ భర్త అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, బస్సును పోలీ్సస్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మంగమ్మ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.