కువైత్లోని భర్త.. రక్షించాలంటూ కడప కలెక్టర్కు భార్య వేడుకోలు..!
ABN , First Publish Date - 2022-03-12T23:39:50+05:30 IST
కువైత్లో తనభర్త వెంకటేశ్కు ఉరి శిక్ష వేస్తామని అక్కడి పోలీసులు చెప్పారని, ఏ పాపం ఎరుగని తన భర్తకు ప్రాణభిక్ష పెట్టాలని లక్కిరెడ్డిపల్లెకు చెందిన వెంకటేశ్ భార్య స్వాతి శుక్రవారం కలెక్టర్ వి.విజయరామరాజును, జేసీ గౌతమిని కలసి వేడుకున్నారు.
కడప(కలెక్టరేట్), మార్చి 11: కువైత్లో తనభర్త వెంకటేశ్కు ఉరి శిక్ష వేస్తామని అక్కడి పోలీసులు చెప్పారని, ఏ పాపం ఎరుగని తన భర్తకు ప్రాణభిక్ష పెట్టాలని లక్కిరెడ్డిపల్లెకు చెందిన వెంకటేశ్ భార్య స్వాతి శుక్రవారం కలెక్టర్ వి.విజయరామరాజును, జేసీ గౌతమిని కలసి వేడుకున్నారు. అనంతరం ఆమె మీడిమాతో మాట్లాడారు. తన భర్త, తాను కువైత్లో వేర్వేరు సేఠ్ల వద్ద ఇంటి పనులు చేసి బతుకుతున్నామన్నారు. గతనెల 25వ తేదీన సేఠ్ కుటుంబంలో ముగ్గురిని గొంతుకోసి చంపాడనే ఆరోపణలతో అక్కడి పోలీసులు తన భర్తను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ హత్యలకు సంబంధించి తననూ, తన భర్తనూ కువైత్ పోలీసులు చిత్రవథకు గురిచేశారని కన్నీరు మున్నీరుగా విలపించారు. చివరకు ఆ హత్యల్లో తనకు సంబంధంలేదని పోలీసులు తనను ఇండియాకు పంపిచేశారన్నారు. తన భర్తకు ఉరి శిక్ష తప్పదన్నారు. తన భర్త కాలు విరిగిందని, అతను ముగ్గురిని హత్య చేయడం అసాధ్యమన్నారు. కువైత్ సేఠ్ కుటుంబానికి పొరుగు ఇళ్ల సేఠ్ల కుటుంబాలతో ఆస్థి గొడవలున్నాయన్నారు. వారే హత్యలు చేసి తన భర్తను ఇరికించారన్నారు. భాష సమస్య కారణంగా అక్కడ తన గోడు చెప్పుకునేందుకు వీలు లేకపోయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని తన భర్తకు ప్రాణభిక్ష పెట్టేలా చూడాలని వెంకటేశ్ భార్య స్వాతి వేడుకున్నారు.