వివాహితపై అత్యాచారం

ABN , First Publish Date - 2021-03-01T04:53:52+05:30 IST

పుట్టింటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన వివాహిత అత్యాచారానికి గురైంది. నమ్మి ఆటో ఎక్కిన పాపానికి ఆటో డ్రైవర్‌, మరో వ్యక్తితో కలిసి సదరు వివాహితను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడు.

వివాహితపై అత్యాచారం

పోలీసుల అదుపులో నిందితులు

కరకగూడెం, ఫిబ్రవరి 28: పుట్టింటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన వివాహిత అత్యాచారానికి గురైంది. నమ్మి ఆటో ఎక్కిన పాపానికి ఆటో డ్రైవర్‌, మరో వ్యక్తితో కలిసి సదరు వివాహితను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పినపాక మండలం మల్లారానికి చెందిన ఓ వివాహిత తన స్వస్థలమైన కరకగూడెం మండలంలోని బర్లగూడేనికి వెళ్లేందుకు ఏడూళ్లబయ్యారం క్రాస్‌ రోడ్డు వద్ద ఆటో ఎక్కింది. ఆ సమయంలో ఆటోలో డ్రైవర్‌తో పాటు మరోవ్యక్తి ఉన్నాడు. ఈక్రమంలో రాళ్లవాగు పెద్దమ్మతల్లి ఆలయం వద్దకు రాగానే ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆటోను ఇటు ఎందుకు తీసుకెళ్తున్నారంటూ సదరు వివాహిత ప్రశ్నిస్తున్నా ఖాతరు చేయలేదు. వివాహితను ఒకరు పట్టుకోగా మరొకరు అత్యాచారం చేశారు. పైగా ఆమెను కొట్టి చిత్రహింసలు పెడుతుండటంతో ఆ దెబ్బలకు తాళలేక కేకలు వేస్తుండటంతో ఆ ప్రాంతంలో కొండచీపురు పుల్లలు కోస్తున్న మహిళలు ఆమె కేకలు విని ఘటనాస్థలానికి వచ్చారు. వారి రాకను గమనించిన నిందితులు పారిపోతుండగా వారిని పట్టుకునేందుకు విఫలయత్నం చేశారు. జరిగిన విషయాన్ని బాధితురాలు ఆ మహిళలకు చెప్పగా అప్పటికే చీకటి పడటంతో వారు ఇళ్లకు వెళ్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు, సాక్షుల వివరాల ప్రకారం ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.


Updated Date - 2021-03-01T04:53:52+05:30 IST