ఏనుగులు కూడా పగబడతాయా..? ఓ మహిళను చంపి.. వెతుక్కుంటూ ఊళ్లోకి వచ్చి మరీ ఆమె ఇంటిని కూల్చి..

ABN , First Publish Date - 2022-06-14T20:14:05+05:30 IST

నోరు లేని జీవాలకు కూడా పగలు, ప్రతీకారాలు ఉంటాయని అప్పుడప్పుడు వింటూ ఉంటాం.

ఏనుగులు కూడా పగబడతాయా..? ఓ మహిళను చంపి.. వెతుక్కుంటూ ఊళ్లోకి వచ్చి మరీ ఆమె ఇంటిని కూల్చి..

నోరు లేని జీవాలకు కూడా పగలు, ప్రతీకారాలు ఉంటాయని అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ముఖ్యంగా పాముల విషయంలోనే ఇలాంటి చర్చ ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే తాజాగా ఒడిశాలో జరిగిన సంఘటన గురించి వింటే ఏనుగులు కూడా పగబడతాయేమో అనే అనుమానం కలుగుతుంది. ఏనుగులు అప్పుడప్పుడు మనుషులపై దాడి చేసి చంపడం గురించి వింటూ ఉంటాం. అయితే ఒడిశాలోని ఓ ఏనుగు ఒకే మనిషిపై మళ్లీ మళ్లీ దాడి చేయడం, ఆమె ఇంటిని ధ్వంసం చేయడం, ఆమె మృతదేహంపై కూడా ప్రతీకారం తీర్చుకోవడం తాజాగా వెలుగులోకి వచ్చింది. 


ఇది కూడా చదవండి..

Viral Video: రెస్టారెంట్‌లో తింటున్న ఓ మహిళతో ఓ వ్యక్తి అసభ్య ప్రవర్తన.. ఆమె అడ్డుకోవడంతో అతడు రెచ్చిపోయి..


ఒడిశా మయుర్‌భంజ్‌ జిల్లా రాయ్‌పాల్‌ గ్రామంలో మాయా ముర్ము అనే ఓ వృద్ధురాలిపై ఈ నెల 10వ తేదీన ఓ ఏనుగు దాడి చేసింది. కిందపడేసి తొక్కింది. తీవ్ర గాయాల పాలైన ఆ వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అదే రోజు సాయంత్రం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడకు కూడా ఆ ఏనుగు వచ్చింది. చితిపై ఉన్న మాయా ముర్ము మృతదేహంపై మరోసారి దాడి చేసింది. మృతదేహాన్ని కింద పడేసి మరోసారి తొక్కింది. 


అక్కడ ఉన్నవారంతా భయానికి లోనై అక్కడి నుంచి పారిపోయారు. ఏనుగు అక్కడి నుండి వెళ్లిపోయిన కాసేపటి తర్వాత వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, గ్రామంలోని ఉన్న ఆ వృద్ధురాలి ఇంటిని కూడా ఆ ఏనుగు నాశనం చేసింది. అంతేకాదు.. ఆమె పెంచుకుంటున్న మేకలను కూడా చంపేసింది. అయితే ఆ వృద్ధురాలిని ఆ ఏనుగు అంతగా ఎందుకు టార్గెట్ చేసిందనేది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. 

Updated Date - 2022-06-14T20:14:05+05:30 IST