మనోధైర్యానికి ‘మార్చ్’
ABN , First Publish Date - 2021-02-23T05:27:02+05:30 IST
ఆడవారిపై నిత్యం ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అలాగే మహిళలు సమాజంలో ఎన్నో సమస్యలు, సవాళ్లతో సతమతం అవుతున్నారు. వాటన్నింటినీ సమర్ధంగా ఎదుర్కొనేలా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మహిళా మార్చ్ పేరుతో మగువల్లో మనోధైర్మం నింపుతోంది.
మహిళల్లో చైతన్యం నింపుతున్న ఐసీడీఎస్ సిబ్బంది
6వ తేదీ వరకు 100 రోజుల ప్రణాళిక
నెల్లూరు (వీఆర్సీ), ఫిబ్రవరి 22 : ఆడవారిపై నిత్యం ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అలాగే మహిళలు సమాజంలో ఎన్నో సమస్యలు, సవాళ్లతో సతమతం అవుతున్నారు. వాటన్నింటినీ సమర్ధంగా ఎదుర్కొనేలా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మహిళా మార్చ్ పేరుతో మగువల్లో మనోధైర్మం నింపుతోంది. 100 రోజుల ప్రణాళికను రూపొందించుకుని అంగన్వాడీ సిబ్బంది ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నెల్లూరు అర్బన్ ప్రాజెక్టు సీడీపీవో సత్యకుమారి ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబరు 19న మొదలైన అవగాహన కార్యక్రమాలు మార్చి 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా మహిళలకు ఉపయోగపడే చట్టాలను తెలియజేసి చైతన్యవంతులను చేస్తున్నారు. సఖి, భరోసా, విద్య, మార్పు వంటి కార్యక్రమాల ఆవశ్యకతనూ వివరిస్తున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై ఫిర్యాదులు ఎలా చేయాలి?, వాటికి పరిష్కారం ఎలా వెతుక్కోవాలి? అనే అంశాలను ‘సఖి’ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
ఇళ్లలో, అపార్ట్మెంట్లలో పనిచేసే మహిళలకు అండగా ‘దిశ’ ఎలా రక్షణ కల్పిస్తుందో వివరిస్తున్నారు.
విద్య కార్యక్రమం ద్వారా విద్యకున్న ప్రాధాన్యతను వివరిస్తూ బాలికా విద్యను ప్రోత్సహించేలా అవగాహన కల్పిస్తున్నారు.
మార్పు కార్యక్రమం ద్వారా తామున్న పరిస్థితికి భిన్నంగా సమాజంలో ఎలా మెలగాలి?, తాగుడు వంటి వ్యసనాలకు తమ భర్తలను దూరంగా ఉంచాలనేది వివరిస్తారు.
ఈ మహిళా మార్చ్ 100 రోజుల కార్యక్రమాలు మార్చి 6వ తేదీతో ముగుస్తుండగా అదే నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.