Hyderabadలో మహిళ దారుణ హత్య.. ఇద్దరు యువకులపై అనుమానం.. అసలేం జరిగింది..!?
ABN , First Publish Date - 2021-11-24T18:04:31+05:30 IST
Hyderabadలో మహిళ దారుణ హత్య.. ఇద్దరు యువకులపై అనుమానం.. అసలేం జరిగింది..!?
హైదరాబాద్ సిటీ/అబ్దుల్లాపూర్మెట్ : మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధి తారామతిపేట గ్రామంలో జరిగింది. ఇన్స్పెక్టర్ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. తారామతిపేట గ్రామానికి చెందిన 58 ఏళ్ల మహిళ, భర్త ఈదయ్య(మల్లేష్) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు మల్లేష్, కుమార్తె నాగమణి ఉన్నారు. మల్లేష్ కానిస్టేబుల్. హయత్నగర్లో ఉంటున్నాడు. కుమార్తె భర్తతో కలిసి సరూర్నగర్లో ఉంటోంది. సోమవారం రాత్రి మహిళ ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది.
మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మహిళ ఇంట్లో గాయాలతో నిర్జీవస్థితిలో ఉండడాన్ని పక్కింట్లో ఉండే ఓరుసు కృష్ణ గమనించి ఆమె కుమారుడు.. మల్లేష్కు ఫోన్ చేసి చెప్పాడు. అబ్దుల్లాపూర్మెట్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, ఇన్స్పెక్టర్ స్వామి డాగ్స్క్వాడ్, క్లూస్టీం రప్పించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి ఎడమ చేతికి గాయంతో పాటు రక్తం మరకలు, ఎడమ భుజం నుంచి మెడ వరకు బలమైన గాయాలతో చర్మం కమిలిపోయింది. ఆమె మృతిపై ఈదయ్యతో పాటు, గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు బుడిగె శ్రీకాంత్, దేవర సురేష్పై అనుమానం ఉన్నట్లు మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అత్యాచారం.. ఆపై హత్య?
ముందుగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోనే భర్తతో పాటు, అనుమానిత యువకులు మద్యం తాగి అనంతరం అత్యాచారానికి ఒడిగట్టి ఉంటారని, ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిజాలు తేలుతాయని పోలీసులు చెబుతున్నారు. మృతురాలి భర్త, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.