HYD : కూలి పనికెళ్లిన మహిళ గుట్టపై శవమై తేలింది.. ఏమైందని ఆరా తీస్తే..!
ABN , First Publish Date - 2021-07-29T18:28:29+05:30 IST
ఆమె గత ఆదివారం పనికి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు...
హైదరాబాద్ సిటీ/జిన్నారం : దినసరి కూలీగా పనిచేస్తున్న ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మండలంలోని మాదారం శివారులో జరిగింది. దుండిగల్, బొల్లారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన మహిళ(35) కుటుంబసభ్యులతో కలిసి మేడ్చల్ జిల్లాలో నివసిస్తూ దినసరి కూలీగా పనిచేస్తోంది. ఆమె గత ఆదివారం పనికి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం జిన్నారం మండలం మాదారం శివారులో అంకెరాళ్ల గుట్టవద్ద మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. మేడ్చల్ డీఎస్పీ లింగారెడ్డి, దుండిగల్ సీఐ రమణారెడ్డి, బొల్లారం ఎస్ఐ జయశంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతురాలు ఈనెల 25న అదృశ్యమైన మహిళా కూలీగా గుర్తించారు. అత్యాచారంచేసి హత్య చేసినట్లు తెలిపారు. ఆమెను పనికోసం ద్విచక్రవాహనంపై తీసుకెళ్లిన స్వామి, నర్సమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై గతంలోనూ కేసులు నమోదైనట్లు తెలిపారు.