జల జీవన్ మిషన్తో మహిళా సాధికారత : మోదీ
ABN , First Publish Date - 2021-10-02T18:41:54+05:30 IST
జల జీవన్ మిషన్ మహిళల సమయాన్ని ఆదా చేయడంతోపాటు
న్యూఢిల్లీ : జల జీవన్ మిషన్ మహిళల సమయాన్ని ఆదా చేయడంతోపాటు వారిని సాధికారులను చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జల జీవన్ మిషన్ మొబైల్ అప్లికేషన్ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ మిషన్ క్రింద స్కీముల్లో జవాబుదారీతనం, పారదర్శకత తేవడం, సంబంధితులందరికీ అవగాహన కల్పించడం ఈ యాప్ లక్ష్యం.
జల జీవన్ మిషన్ వల్ల మహిళలు సాధికారులవుతున్నారని మోదీ చెప్పారు. గతంలో తాగునీటిని తేవడం కోసం మహిళలు సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వచ్చేదన్నారు. ఆ సమయం, శ్రమ జల జీవన్ మిషన్ వల్ల ఆదా అవుతున్నాయన్నారు.
ఈ సందర్భంగా మోదీ వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్లతో మాట్లాడారు. గ్రామీణ నీరు, పారిశుద్ధ్యం కమిటీల ప్రతినిధులతో కూడా మాట్లాడారు. జల జీవన్ మిషన్ వల్ల తమ గ్రామాల్లో ప్రతి కుటుంబానికి పరిశుభ్రమైన తాగు నీరు కొళాయి ద్వారా లభిస్తోందని సర్పంచ్లు, కమిటీల ప్రతినిధులు చెప్పారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి మహిళలు తమ సమయాన్ని తమ పిల్లలను చదివించడానికి, ఆదాయం వచ్చే కార్యకలాపాలకు ఖర్చుపెడుతున్నారని చెప్పారు.