పెళ్లై మూడు నెలలు కాలేదు.. కట్నం కోసం భార్యను ఎంత క్రూరంగా హింసించాడంటే..

ABN , First Publish Date - 2021-07-21T17:00:40+05:30 IST

పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో అత్తింట అడుగు పెట్టిన వధువుకు కష్టాలే స్వాగతం పలికాయి..

పెళ్లై మూడు నెలలు కాలేదు.. కట్నం కోసం భార్యను ఎంత క్రూరంగా హింసించాడంటే..

పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో అత్తింట అడుగు పెట్టిన వధువుకు కష్టాలే స్వాగతం పలికాయి.. అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి.. కట్టుకున్న భర్త, ఆయన సోదరి మానసికంగా, శారీరకంగా వేధించారు.. అయినా అన్నింటినీ ఆమె మౌనంగా భరించింది.. చివరకు వారు ఎంతకు తెగించారంటే.. ఆమె నోటిలో యాసిడ్ పోసేశారు.. అనంతరం నిప్పు అంటించారు.. దీంతో ఆమె నరకయాతన అనుభవించింది.. ప్రస్తుతం ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టులాడుతోంది.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


గ్వాలియర్‌లోని డబ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో బాధిత యువతికి ఈ ఏడాది ఏప్రిల్‌ 17వ తేదీన వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజులకే అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టారు. భర్త, అతడి సోదరి ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించారు. జూన్‌ 3వ తేదీన వారు ఆ యువతిని తీవ్రంగా కొట్టి బలవంతంగా యాసిడ్‌ తాగించారు. అంతటితో ఆగకుండా శరీరానికి నిప్పు అంటించారు. నరకం అనుభించిన ఆమె అరుపులు, కేకలు వేయడం ప్రారంభించింది. దీంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. 


యాసిడ్‌ ప్రభావంతో జీర్ణాశయం పూర్తిగా దెబ్బతింది. కడుపు ముందరి భాగం కూడా పూర్తిగా కాలిపోయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కొన ఊపిరితో ఉంది. ఈ దారుణంపై ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తూ ఓ లేఖ రాశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 

 

Updated Date - 2021-07-21T17:00:40+05:30 IST