గొంతేరులో దూకి యువతి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-22T05:21:44+05:30 IST

ఆమె తండ్రి ఏడాది క్రితం కరోనాతో మృతి చెందాడు.

గొంతేరులో దూకి యువతి ఆత్మహత్య
అశ్వని మృతదేహం

మొగల్తూరు, జనవరి 21: ఆమె తండ్రి ఏడాది క్రితం కరోనాతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె తండ్రిని తలచుకుని బాధపడేది. వివాహమైతే కొంత తేరకుంటుందని కుటుంబ సభ్యులు మూడు నెలల క్రితం ఆమె పెళ్లి చేశారు. నాన్నను మరిచిపోలేని ఆమె శుక్రవారం గొంతేరు డ్రెయిన్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవులో శుక్రవారం జరిగిన సంఘటన వివరాలు ఎస్‌ఐ ఆర్‌.మల్లికార్జునరెడ్డి తెలిపారు. కాళీపట్నం పడమరకు చెందిన జక్కంశెట్టి ధర్మారావు గత ఏడాది కరోనా కారణంగా మృతి చెందాడు. అప్పటి నుంచి అతడి కుమార్తె అశ్వని బాధపడుతూనే ఉంది. ఈనేపథ్యంలో మూడు నెలల క్రితం ఆశ్వనికి (23)కి భీమవరం మండలం దిరుసుమర్రుకు చెందిన వేండ్ర రామకృష్ణతో వివాహమైంది. సంక్రాంతికి కాళీపట్నం వచ్చిన ఆమె గురువారం అర్ధరాత్రి మోటార్‌సైకిల్‌పై ఒంటరిగా ముత్యా లపల్లి పంచాయతీ చింతరేవు ప్రాంతంలోని జాతీయ రహదారి వంతెన వద్దకు చేరుకుంది. మోటార్‌సైకిల్‌, సెల్‌ఫోన్‌ వదిలేసి డ్రెయిన్‌లోకి దూకేసింది. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించగా చింతరేవు వంతెన వద్ద మోటార్‌ సైకిల్‌ను గుర్తించి డ్రెయిన్‌లో గాలించారు. వంతెన సమీపంలోని ముత్యాలపల్లి రేవు వద్ద మృతదేహాన్ని గుర్తించారు. బాధితురాలి తల్లి తులసి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-01-22T05:21:44+05:30 IST