మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి
ABN , First Publish Date - 2021-03-06T06:11:01+05:30 IST
మహిళలు అన్ని రంగాల్లో ముందుండేందుకు కృషి చేయాలని రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి సూచించారు.
- దాడులను ఎదుర్కొనేందుకు దిశ యాప్ను వినియోగించాలి
- రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి
బిక్కవోలు, మార్చి 5: మహిళలు అన్ని రంగాల్లో ముందుండేందుకు కృషి చేయాలని రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి సూచించారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బిక్కవోలు శ్రీప్రజ్ఞా కళాశాలలో విద్యార్థినులకు శుక్రవారం బిక్కవోలు పోలీసులు మహిళా చట్టాలు, పోలీసు సేవల ఆవశ్యకతపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మహిళలు తమపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు విధిగా దిశ యాప్ను వినియోగించాలని కోరారు. అనపర్తి సీఐ భాస్కరరావు మాట్లాడుతూ స్నేహపూర్వక పోలీస్ గురించి వివరించి, దేశంలో వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అంతకు ముందు స్థానిక పోలీస్స్టేషన్లో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఓదూరి శ్రీను, ఎస్ఐ వాసు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కంటి వ్యాధుల పట్ల నిర్లక్ష్యం తగదు
కంటి వ్యాధుల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా వుండాలని డీఎస్పీ సూచించారు. స్థానిక విశ్వమానవతా సంస్థ ఆవరణలో స్థానిక అవిష్యాత్ హెల్పింగ్ హ్యాండ్స్ సహకారంతో వేమగిరి పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. శిబిరంలో 200 మందికి వైద్యపరీక్షలు జరిపి 20 మందికి శస్త్రచికిత్సలు అవసరమవుతాయని గుర్తించారు. కార్యక్రమంలో మానవతా సంస్థ అధ్యక్షుడు చౌదరి తదితరులు పాల్గొన్నారు.