‘మహిళల పాత్ర వెలకట్టలేనిది’
ABN , First Publish Date - 2021-12-04T05:23:51+05:30 IST
కుటుంబ నిర్మాణంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని సెర్ఫ్ సీఈవో ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు.
కోడుమూరు(రూరల్), డిసెంబరు 3: కుటుంబ నిర్మాణంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని సెర్ఫ్ సీఈవో ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. శుక్రవారం కోడుమూరు వెలుగు భవనంలో పొదుపు మహిళల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఈవో మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. రాష్ట్రంలో 90 లక్షల మంది మహిళలు సెర్ఫ్లో భాగంగా ఉన్నారని, వారందరికీ వివిధ పథకాల కింద ఆదాయ వనరులు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పొదుపు మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పొదుపు మహిళలకు రు.1.68 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల మెగా చెక్కును అందించారు. అలాగే ప్లాస్టిక్ రహిత బ్యాగులను అందిస్తూ ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పొదుపు మహిళలు, ఉద్యోగులు సెర్ప్ సీఈవోను దుశాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అంతకముందు సీఈవో బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు తన సందేశం అందిస్తూ తాను ఇదేపాఠశాలలో చదువుకున్నట్లు తెలిపారు డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు, డీపీఎంలు లక్ష్మయ్య, శ్రీధర్రావు, రెహమాన్, ఏపీఎం పుష్పావతి, హెచ్ఎం శ్రీనివాసయాదవ్, సీసీలు పొదుపు మహిళలు పాల్గొన్నారు.