ప్రపంచకప్ గెలిచే సత్తా మాకుందని నిరూపించాం: మిథాలీ రాజ్

ABN , First Publish Date - 2022-02-22T23:25:39+05:30 IST

మహిళల వన్డే ప్రపంచకప్ గెలుపు దేశంలోని అభిమానుల్లో నిజమైన మార్పు తీసుకొస్తుందని భారత జట్టు కెప్టెన్ మిథాలీ..

ప్రపంచకప్ గెలిచే సత్తా మాకుందని నిరూపించాం: మిథాలీ రాజ్

న్యూఢిల్లీ: మహిళల వన్డే ప్రపంచకప్ గెలుపు దేశంలోని అభిమానుల్లో నిజమైన మార్పు తీసుకొస్తుందని భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. న్యూజిలాండ్‌లో వచ్చే నెల 4న మహిళల ప్రపంచకప్ ప్రారంభం కానుంది. 6న చిరకాల ప్రత్యర్థులపై భారత్-పాక్ జట్లు తమ తొలి మ్యాచ్‌లో తలపడతాయి.


2017 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన టైటిల్ పోరులో విమెన్ ఇన్ బ్లూ చతికిల పడింది. అయినప్పటికీ భారత మహిళల క్రికెట్‌లో అదో మైలురాయిగా నిలిచిపోయింది. ఆ తర్వాత దేశంలో మహిళా క్రికెట్‌‌కు పాపులారిటీ పెరిగింది.


మూడు ప్రపంచకప్‌లలో రెండుసార్లు ఫైనల్స్‌కు చేరిన భారత జట్టుకు సారథ్యం వహించడం గొప్ప గౌరవమని ఐసీసీకి రాసిన కాలమ్‌లో మిథాలీ రాజ్ పేర్కొంది. 2005లో దక్షిణాఫ్రికాలో జరిగిన మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ కాలంలో తాము గుర్తుండిపోయే ప్రదర్శన చేశామని పేర్కొంది.


అయితే, ఓ పెద్ద విజయాన్ని మాత్రం మిస్సయామని తెలిపింది. వన్డే, టీ20 ప్రపంచకప్‌లలో తాము ఓడిపోయిన ఫైనలిస్టులమని మిథాలీ పేర్కొంది. ఈ అనుభవం నుంచి తాము ఎంతో నేర్చుకున్నట్టు తెలిపింది. న్యూజిలాండ్‌లో ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో ఈ అనుభవం ఎంతో పనికొస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రపంచకప్ గెలవగల సత్తా తమకుందని ఇప్పటికే నిరూపించినట్టు వివరించింది. ప్రపంచకప్ గెలుపు ఆటగాళ్లు, తమ కుటుంబ సభ్యుల్లోనే కాక, భారత్‌లోని తమ అభిమానుల్లోనూ నిజమైన మార్పును తీసుకొస్తుందని పేర్కొంది.  


ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న మిథాలీ సేనకు దారుణ పరాభవం ఎదురైంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు జరిగిన నాలుగో వన్డేలోనూ ఓడిన భారత జట్టు మొత్తం నాలుగింటిలోనూ ఓటమి పాలై సిరీస్‌ను 0-4తో సమర్పించేసుకుంది. అంతకుముందు జరిగిన ఏకైక టీ20లోనూ భారత జట్టు ఓటమి పాలైంది. 

Updated Date - 2022-02-22T23:25:39+05:30 IST