అవినీతికి తావు లేకుండా పనిచేయాలి
ABN , First Publish Date - 2021-06-23T05:40:49+05:30 IST
ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా విధులు నిర్వహించాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) సమా వేశంలో జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ చెప్పారు.
ఎస్ఈబీ అధికారులతో ఎస్పీ నాయక్ సమావేశం
ఏలూరు క్రైం, జూన్ 22: ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా విధులు నిర్వహించాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) సమా వేశంలో జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ చెప్పారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఈబీ అధికా రులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు, ఖైనీ, గుట్కాలతో పాటు మద్యం ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరగకుం డా అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా చెక్ పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్ఈబీ అధికారులు, స్థానిక పోలీసులు సమన్వ యంతో పనిచేయాలన్నారు. ఇసుక ర్యాంపుల వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే అధికంగా డబ్బులు వసూలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహ రించాలని, తీర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఎస్ఈబీ అధికారులు వారి స్టేషన్ పరిధిలో నది, వాగులు నుంచి ఇసుక అక్రమ రవాణా, నిల్వలపై పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలని, గంజాయి, గుట్కా, ఖైనీ, నాటుసారా, మాదక ద్రవ్యాల రవాణా అరికట్టేందుకు దాడులు నిర్వహించాలని ఆదేశించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనదపు ఎస్పీ జయరామరాజు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.