పనిభారం!
ABN , First Publish Date - 2021-10-24T05:21:57+05:30 IST
జిల్లా పరిషత్ పరిపాలన విభాగంలోని ఉద్యోగులు పనిభారంతో సతమతమవు తున్నారు.
- జడ్పీలో ఉద్యోగుల అవస్థలు
- 11 మంది డిప్యుటేషన్పై బదిలీ
కర్నూలు (న్యూసిటీ), అక్టోబరు 23: జిల్లా పరిషత్ పరిపాలన విభాగంలోని ఉద్యోగులు పనిభారంతో సతమతమవు తున్నారు. ఈ విభాగంలోని 7 సెక్షన్లలో సుమారు 100 పైగా ఉద్యోగులు వివిధ కేడర్లలో పని చేస్తున్నారు. వీరిలో 11 మంది కొందరు నాయకుల ఒత్తిడిని తట్టుకోలేక ఇతర కార్యాలయాలకు డిప్యుటేషన్పై వెళ్లారు. దీంతో ఉన్న ఉద్యోగులకు పనిభారం పెరిగింది. ప్రధానంగా సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు ఎంపీడీవో, జాయింట్ కలెక్టర్ కార్యాలయాలకు డిప్యుటేషన్పై వెళ్లడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, కౌంటింగ్ సమయాల్లో ఉన్న ఉద్యోగులతోనే పని చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో వారు అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిల్లా పరిషత్తో పనిచేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో పనిభారం పెరిగి జబ్బుల బారిన పడుతున్నామని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎస్టాబ్లిష్మెంట్, అకౌంట్ సెక్షన్లో ఉన్న ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు సీఈవో దృష్టికి తీసుకెళ్లినా మాటదాటవేస్తున్నారని అంటున్నారు.
డిప్యుటేషన్పై ఇతర కార్యాలయాలకు వెళ్లిన వారు
సీనియర్ అసిస్టెంట్లు
బి.వెంకటేశ్వర్లు ఎంపీపీ, దొర్నిపాడు
ఎన్.భాగ్యలక్ష్మి పీఆర్ సబ్డివిజన్ డోన్
వై.వీరశేఖర్ ఎంపీపీ, బండిఆత్మకూరు
వై. మనోహర్బాబు పీఆర్ఐ సబ్ డివిజన్ పాణ్యం
ఎస్.షేక్షావలి డీఎల్డీవో, కర్నూలు
కె.ఉమాదేవి ఎంపీపీ, డోన్
జె.మోహన్నాయక్ ఎంపీపీ, వెల్దుర్తి
అఖిల్బాషా జాయింట్ కలెక్టర్(అభివృద్ధి)
జూనియర్ అసిస్టెంట్లు..
డి.కిరణ్కుమార్ ఆర్థిక శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయం
డి.రాంసింగ్నాయక్ జాయింట్ కలెక్టర్(హౌసింగ్)
ఆర్.తిరుమలేశ్వరరెడ్డి(టైపిస్టు) కలెక్టరేట్
ఉన్నవారితోనే పని చేయించుకుంటాం
జడ్పీలో ఉన్న ఉద్యోగులతోనే పనులు చేయించుకుంటాం. అవసరం అనుకుంటే డిప్యుటేషన్ రద్దు చేసిన ఉద్యోగులకు వెనక్కి రప్పించుకుంటాం. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేయాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మండల కార్యాలయాల్లో డిప్యుటేషన్ ప్రాతిపదికన నియమిస్తున్నాం.
- ఎం.వెంకటసుబ్బయ్య, జడ్పీ సీఈవో