బ్యాట్లెత్తేశారు!

ABN , First Publish Date - 2021-06-24T08:24:00+05:30 IST

రోహిత్‌ శర్మ, పుజార, విరాట్‌ కోహ్లీ, రహానె వంటి ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌ ఉన్న టీమిండియా ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్లో చేతులేత్తేసింది.

బ్యాట్లెత్తేశారు!

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం): రోహిత్‌ శర్మ, పుజార, విరాట్‌ కోహ్లీ, రహానె వంటి ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌ ఉన్న టీమిండియా ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్లో చేతులేత్తేసింది. గత ఆస్ట్రేలియా పర్యటనలో మేటి బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు లేకుండానే కంగారూలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన భారత్‌ ఇప్పుడు ప్రముఖ ఆటగాళ్లు ఉండి కూడా ‘ఫైనల్లో’ ఓటమి చవిచూసింది. రెండేళ్ల పాటు సాగిన ఈ చాంపియన్‌షి్‌పలో 520 పాయింట్లతో అగ్రభాగాన నిలవడం ద్వారా ఫైనల్‌కు సగర్వంగా అడుగుపెట్టిన కోహ్లీసేన కీలక సమరంలో అదే ప్రదర్శన చేయడంలో విఫలమైంది. రెండురోజులు పూర్తిగా వర్షార్పణమైనా.. మ్యా చ్‌ను కోల్పోవడం ద్వారా అవమానకర ఓటమిని ఎదుర్కొంది. మరో సెషన్‌పాటు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ ఓపిగ్గా, తెలివిగా ఆడివుంటే మ్యాచ్‌ కచ్చితంగా డ్రా అయ్యేది. కానీ కివీస్‌ బౌలర్లు స్వింగ్‌, బౌన్స్‌తోపాటు మన అగ్రగామి బ్యాట్స్‌మెన్‌ వికెట్ల ఆవలిగా వేసే బంతులను ఆడలేని బలహీనతను సొమ్ము చేసుకొని దెబ్బ కొట్టారు. తమ జట్టు తొలిసారి ఐసీసీ ట్రోఫీ అందుకోవడంలో కీలక భూమిక పోషించారు.


మరీ ముఖ్యంగా ఆఫ్‌స్టంప్‌ ఆవలిగా వేసే బంతులను వేటాడి అవుటవడం లేదంటే వాటిని సరిగా ఆడలేకపోయే కోహ్లీ బలహీనతను బాగా సద్వినియోగం చేసుకున్నాడు పేసర్‌ జేమిసన్‌. ఆఫ్‌స్టంప్‌ ఆవలిగా వేసిన బంతితోనే పుజరా వికెట్‌ కూడా పడగొట్టాడు. ఇక ఓవర్‌ ద వికెట్‌తో లెగ్‌స్టంప్‌ ఆవలిగా బౌల్ట్‌ సంధించిన బంతిని ఫ్లిక్‌ చేయబోయి రహానె వికెట్‌ పారేసుకున్నాడు. ఆదుకుంటాడనుకున్న పంత్‌ కూడా అనసరంగా భారీషాట్‌ కొట్టబోయి వికెట్‌ సమర్పించుకున్నాడు. మొత్తంగా కివీస్‌ పేసర్ల తెలివైన బౌలింగ్‌ను మన బ్యాట్స్‌మెన్‌ అంతే తెలివిగా ఆడలేక అవుట్‌కావడం గమనార్హం. భారత బౌలర్ల విషయానికొస్తే.. ప్రత్యర్థి లోయరార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను త్వరగా అవుట్‌ చేయలేకపోవడం మినహా మ్యాచ్‌లో తమ పాత్ర సమర్థంగా నిర్వర్తించారు. 

Updated Date - 2021-06-24T08:24:00+05:30 IST