అమ్మో.... వై జంక్షన్
ABN , First Publish Date - 2021-05-07T05:02:14+05:30 IST
స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమీపంలో గల వై జంక్షన్ ప్రయాణికుల గుండెల్లో టెన్షన్ పుట్టిస్తోంది.
ప్రయాణికుల గుండెల్లో దడ
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
పరవాడ, మే 6: స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమీపంలో గల వై జంక్షన్ ప్రయాణికుల గుండెల్లో టెన్షన్ పుట్టిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ జంక్షన్లో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పరవాడ నుంచి గాజువాక వైపు వెళ్లే వాహనాలు జంక్షన్ వద్దకు వచ్చే సరికి నేరుగా లంకెలపాలెం వైపు తిరుగుతాయా లేకుంటే గాజువాక వైపు వెళ్తాయో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా గాజువాక నుంచి వచ్చే వాహనాలు లంకెలపాలెం వైపు వెళ్తాయో లేక పరవాడ ఊరులోకి వస్తాయో తెలియక గందరగోళం నెలకొంటోంది. జంక్షన్ వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు లంకెలపాలెం నుంచి వచ్చే భారీ వాహనాలు అతి వేగంగా వచ్చే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో లంకెలపాలెం నుంచి వచ్చే రహదారి వద్ద స్పీడు బ్రేకర్లు వుండేవి. అయితే ఇటీవల రహదారి విస్తరణలో భాగంగా వాటిని తొలగించడంతో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. నిత్యం రద్దీగా ఉండే ఈ జంక్షన్లో హెచ్చరిక బోర్డులు, స్పీడు బ్రేకర్లు లేకపోవడంతో ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బొగ్గు లారీలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుండడంతో జంక్షన్ వద్ద ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. లంకెలపాలెం వైపు నుంచి వచ్చే బొగ్గు లారీలు ఒక్కోసారి సడన్గా పరవాడ వైపు మలుపు తిరగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిజానికి అవి గాజువాక వైపు వెళ్లే రహదారి గుండా పోవాలి. అయితే డ్రైవర్లు అప్పుడప్పుడు పరవాడ వైపు తిప్పడంతో ఆ సమయంలో అటుగా వచ్చే వాహనదారులు కంగారు పడాల్సి వస్తోంది.
రాత్రి వేళలో మరీ దారుణం
రాత్రి వేళల్లో జంక్షన్ వద్ద పరిస్థితి మరింత దారుణంగా వుంటోంది. వాహనాలు ఎటు వైపు వెళ్తాయో తెలియక ఆ సమయంలో అటుగా రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. జంక్షన్ సమీపంలో మూడు వైపులా స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు హెచ్చరిక బోర్డులు పెట్టినట్టయితే కొంత మేర ప్రమాదాలను అరికట్టవచ్చని ప్రయాణికులు అంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ జంక్షన్లో ఇప్పటి వరకు ఆర్ అండ్ బీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.