ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే సీఎం చోద్యం చూస్తున్నారు: యనమల
ABN , First Publish Date - 2021-05-09T17:48:43+05:30 IST
రాష్ట్రంలో కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యనమల రామకృష్ణుడు విమర్శించారు.
అమరావతి: రాష్ట్రంలో కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే సీఎం చోద్యం చూస్తున్నారని, సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని తెలిసినా ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రపంచమంతా కరోనాపై పోరాడుతుంటే జగన్ ప్రత్యర్థులపై పోరులో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎన్ 440కే వైరస్ గురించి చంద్రబాబు అప్రమత్తం చేయడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు, లోకేష్పై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సంక్షోభాలను ఎదుర్కొనే సత్తా ఈ ముఖ్యమంత్రికి లేదన్నారు. ప్రత్యర్థులపై వేధింపులను కట్టిపెట్టి ప్రజారోగ్యంపై దృష్టిపెట్టాలని యనమల సూచించారు.