రాష్ట్రాన్ని వైసీపీ దుష్ట చతుష్టయం పట్టి పీడిస్తోంది: యనమల
ABN , First Publish Date - 2022-04-24T17:26:15+05:30 IST
ఏపీ రాష్ట్రాన్ని వైసీపీ దుష్ట చతుష్టయం పట్టిపీడిస్తోందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.
అమరావతి: ఏపీ రాష్ట్రాన్ని వైసీపీ దుష్ట చతుష్టయం పట్టిపీడిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనే జగన్రెడ్డి రాష్ట్రాన్ని మరింత అప్పుల ఉబిలోకి నెట్టాలని చూస్తున్నారని, కేంద్రం పట్టించుకోకపోతే... ఏపీ కొలెటరల్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని అన్నారు. జగన్ రెడ్డిది మోసకారి సంక్షేమం అని ప్రజలే భావిస్తున్నారన్నారు. జగన్రెడ్డి చేసిన రుణాలు ఎవరు తీర్చాలన్నదే ఇప్పుడు ప్రశ్న? అని, అవినీతి సొమ్ము కూడబెట్టి వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అవినీతి సొమ్మును కేంద్రం బయటకు తీయాలని డిమాండ్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్షాలపై కేసులు పెట్టి వేధించడం తప్ప చేసిందేమీ లేదని యనమల రామకృష్ణుడు అన్నారు.