ఏపీ కేబినెట్ కూర్పుపై యనమల ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-04-12T20:48:09+05:30 IST
ఏపీ కేబినెట్ కూర్పుపై యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఏపీ కేబినెట్ కూర్పుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మంత్రి వర్గం ఛాయ్, బిస్కెట్ కేబినెట్ అంటూ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గత మంత్రి వర్గం పప్పెట్ కేబినెట్ అయితే.. ఇప్పుడు ఛాయ్, బిస్కెట్ కేబినెట్ అన్నారు. జగన్ కేబినెట్లో మంత్రులకు స్వేచ్ఛ లేదని విమర్శించారు. సీఎం కిచెన్ కేబినెట్లోనూ, సలహదారుల బృందంలోనూ బీసీలు ఎందుకు లేరని ప్రశ్నించారు. నిర్ణయాలు తీసుకునే కోర్ కమిటీ.. కిచెన్ కేబినెట్లో బీసీలకు ప్రాధాన్యత లేదని ఆరోపించారు. ప్రాధాన్యత, పెత్తనంలేని పదవులిచ్చి.. ప్రాతినిధ్యం కల్పించామని ఎలా చెబుతారన్నారు.
టీడీపీ ఆవిర్భావంతోనే బీసీలకు ప్రాతినిధ్యమే కాదు.. ప్రాధాన్యత కూడా వచ్చిందని యనమల అన్నారు. సజ్జల ఎవరు? సీఎం సన్నిహితుడైతే మంత్రులను డిక్టేట్ చేస్తారా? అని ప్రశ్నించారు. కేబినెట్లో బీసీలు ఉండాలి కాబట్టి.. ఇస్తున్నారని అన్నారు. ప్రజల్లో వైసీపీ పట్ల నెగిటీవ్ ఉందని, అందుకే పార్టీలో కూడా కొంత మంది తిరగబడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్టీలో ఒత్తిళ్లకు ముఖ్యమంత్రి లొంగక తప్పలేదన్నారు. వైసీపీలో అసంతృప్తి మొదలైందని.. జగన్పై తిరగబడుతున్నారని ఇటీవల జరిగిన పరిణామాల ద్వారా అర్ధమవుతోందని యనమల వ్యాఖ్యానించారు.