యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవు: సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2021-11-30T01:29:09+05:30 IST
యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం కేసీఆర్ తెలిపారు. బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని నమ్ముకుంటే ...
హైదరాబాద్: యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం కేసీఆర్ తెలిపారు. బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని నమ్ముకుంటే సర్వనాశనం కావ్వాల్సిందేనన్నారు. మత చిచ్చు పెట్టి దేశ సమగ్రతను దెబ్బతీస్తారని చెప్పారు. దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడేళ్లలో బీజేపీ ఏ రంగానికి మేలు చేసిందో చెప్పాలన్నారు. రైతులు బాగుపడాలంటే బీజేపీ ప్రభుత్వం పోవాలని వ్యాఖ్యానించారు. గత రెండేళ్లలో దేశంలో భయంకరంగా పేదరికం పెరిగిందని చెప్పారు. కేంద్రం పవర్ రిఫామ్స్ పేరుతో రాష్ట్రం మెడమీద కత్తి పెడుతోందని తెలిపారు. ప్రతి బోర్ దగ్గర మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశించిందని పేర్కొన్నారు. కేంద్రం దుష్టా పాలనతో దేశంలో ఆకలి కేకలు పెరిగాయన్నారు. కేంద్రానికి సామాజిక బాధ్యత ఉంటే ధాన్యం కొనాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
‘‘కేంద్రానికి ఇంతనన్న సిగ్గుండాలి. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ కంటే దారుణమైన స్థానంలో భారత్ ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 116 దేశాల్లో 101వ స్థానం భారత్ది. కేంద్రమంత్రి పియూష్ గోయల్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. దేశంలో నకిలీ విత్తనాలపై పీడీయాక్ట్ తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను 100శాతం ముంచుతుంది. బీజేపీ నేతలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు.750 మంది రైతుల్ని పొట్టనబెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ.’’ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.