విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా Yashwant sinha?
ABN , First Publish Date - 2022-06-21T19:38:59+05:30 IST
పక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి యశ్వంత్ సిన్హాను ఎంపిక..
న్యూఢిల్లీ: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి (Presidential candidate)గా మాజీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా (Yashwant sinha)ను ఎంపిక చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంగళవారం జరిగిన విపక్ష పార్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం విపక్షాల సమావేశానికి ముందే కాంగ్రెస్, వామపక్షాల డిమాండ్ మేరకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి యశ్వంత్ సిన్హా రాజీనామా చేశారు. ఈనెల 27వ తేదీన యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసే అవకాశం ఉంది.
కాగా, విపక్ష నేతల ఇన్ఫార్మల్ మీటింగ్లో శరద్ పవార్, మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేష్, సీతారాం ఏచూరి, డి.రాజా, ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు హౌస్ ఎనెక్స్లో మధ్నాహ్నం సమావేశమైన నేతలంతా యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించక ముందే ఆయన టీఎంసీకి రాజీనామా చేయాలని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు సోమవారం డిమాండ్ చేశారు. దీంతో మంగళవారం ఉదయమే సిన్హా టీఎంసీకి రాజీనామా చేశారు. విపక్షాల ఐక్యత కోసం రాజీనామా నిర్ణయాన్ని సిన్హా తీసుకున్నారు. బీజేపీ మాజీ నేత అయిన యశ్వంత్ సిన్హా గత ఏడాది మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్లో చేరారు.