వీడిన ఉత్కంఠ: విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా Yashwant sinha
ABN , First Publish Date - 2022-06-21T21:39:27+05:30 IST
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్కు తెరపడింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా..
న్యూఢిల్లీ: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్కు తెరపడింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర విదేశాంగ మంత్రి యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) పేరును విపక్ష పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. మంగళవారం జరిగిన విపక్ష పార్టీ సమావేశంలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ అధికారికంగా ప్రకటించారు. ఈనెల 27వ తేదీన యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసే అవకాశం ఉంది.
పార్లమెంట్ హౌస్ ఎనెక్స్లో విపక్ష నేతలు మంగళవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. శరద్ పవార్, మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేష్, సీతారాం ఏచూరి, డి.రాజా, ప్రఫుల్ పటేల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి ముందు, విపక్ష పార్టీలైన కాంగ్రెస్, వామపక్షాలు చేసిన డిమాండ్ మేరకు తృణమూల్ కాంగ్రెస్కు (TMC) యశ్వత్ సిన్హా రాజీనామా చేశారు. దీంతో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిత్వానికి మార్గం సుగమం అయింది.బీజేపీ మాజీ నేత అయిన యశ్వంత్ సిన్హా గత ఏడాది మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్లో చేరారు.