పోలీసు స్టేషన్‌ ముందే టీడీపీ నేతపై వైసీపీ దాడి

ABN , First Publish Date - 2021-10-23T07:03:47+05:30 IST

చంద్రగిరి పోలీసు స్టేషన్‌ ముందే టీడీపీ నేత యశ్వంత్‌చౌదరిపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు.

పోలీసు స్టేషన్‌ ముందే టీడీపీ నేతపై వైసీపీ దాడి
యశ్వంత్‌చౌదరిపై దాడి చేస్తున్న వైసీపీ కార్యకర్త

చంద్రగిరిలో ఉద్రిక్త వాతావరణం

సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులే కారణం 


చంద్రగిరి, అక్టోబరు 22: చంద్రగిరి పోలీసు స్టేషన్‌ ముందే టీడీపీ నేత యశ్వంత్‌చౌదరిపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. సాయంత్రం వైసీపీ నేత మల్లం చంద్రమౌళిరెడ్డి తన అనుచరులతో వీధుల్లో హల్‌చల్‌ చేశారు. ఈ పరిణామాలతో శుక్రవారం చంద్రగిరిలో ఉద్రిక్తత నెలకొంది. సోషల్‌ మీడియాలో రెండు పార్టీల మధ్య అసభ్యకర పదజాలంతో పెట్టిన పోస్టులతో ఈ వివాదం మొదలైంది. వివరాలిలా ఉన్నాయి. చంద్రగిరిలో చేపట్టిన జనాగ్రహ దీక్షలో గురువారం సాయంత్రం వైసీపీ నేత మల్లం చంద్రమౌళిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేశ్‌పై పలు విమర్శలు చేశారు. దీంతో చంద్రగిరి మండలానికి చెందిన తెలుగు యువత నేత రాకే్‌షచౌదరి తన సోషల్‌ మీడియాలో తమ అధినేతను విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదంటూ ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండా పోస్టులు పెట్టారు. అనంతరం వైసీపీ, టీడీపీ నాయకులు సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం టీడీపీ నేత యశ్వంత్‌ చౌదరి పోలీస్‌ స్టేషన్‌ ముందు ఉండగా.. వైసీపీ నేత చంద్రమౌళిరెడ్డి భార్య మల్లం దీపికారెడ్డి తన అనుచరులతో అక్కడికి వచ్చారు. యశ్వంత్‌చౌదరిపై దాడి చేశారు. సమీపంలో ఉన్న టీడీపీ నాయకులూ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకోవడంతో.. అక్కడే ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నేతలు యశ్వంత్‌చౌదరి, భానుప్రకా్‌షరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇరువర్గాలను పంపించేశారు. రాత్రి 7 గంటల సమయంలో వైసీపీ నేత చంద్రమౌళిరెడ్డి తన అనుచరులతో కలిసి చంద్రగిరి వీధుల్లో హల్‌చల్‌ చేశారు. యశ్వంత్‌చౌదరికి సంబంధించిన వస్త్ర దుకాణానికి వెళ్ళారు. పోలీసులు వారి వెంట ఉండటంతో అక్కడ్నుంచి పోలీస్‌ స్టేషన్‌కు.. అనంతరం టవర్‌ క్లాక్‌ వద్దనున్న వైసీపీ శిబిరానికి చేరుకున్నారు. తిరుపతి వెస్ట్‌ డీఎస్పీ నర్సప్ప అక్కడికి చేరుకుని మల్లం చంద్రమౌళిరెడ్డిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. అనంతరం టీడీపీ నాయకులతోనూ చర్చించడంతో వివాదం సద్దుమణిగింది. పోలీస్‌ స్టేషన్‌ ముందు ఘర్షణ జరగడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి కేసులు నమోదు చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని డీఎస్పీ టీడీపీ నాయకులకు చెప్పినట్లు తెలిసింది.



Updated Date - 2021-10-23T07:03:47+05:30 IST