వైసీపీ బస్సు యాత్ర.. వెలవెల
ABN , First Publish Date - 2022-05-29T06:15:28+05:30 IST
జిల్లాలో శనివారం సామాజిక న్యాయభేరి - వైసీపీ బస్సుయాత్ర వెలవెలబోయింది.
కనిపించని ప్రజా స్పందన
మహిళల్ని తరలించేందుకు నేతల తంటాలు
ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్, మే28: జిల్లాలో శనివారం సామాజిక న్యాయభేరి - వైసీపీ బస్సుయాత్ర వెలవెలబోయింది. యాత్ర మధ్యాహ్నం గుంటూరు జిల్లాలోకి కనకదుర్గమ్మ వద్దకు ప్రవేశించగా రాజ్యసభ సభ్యులు అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కిలారు రోశయ్య, మోదుగుల వేణుగోపాలరెడ్డి, తదితర నేతలు, కార్యకర్తలు తరలివచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులకు స్వాగతం పలికారు. గుంటూరు నగరానికి సంబంధించి పెదకాకాని వై జంక్షన్ వద్ద బస్సుయాత్ర సభ ఏర్పాటు చేశారు. నగరం నుంచి కేవలం ఐదు, ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఈ వేదిక ఉన్నప్పటికీ ప్రజలు ఏమాత్రం ముందుకు రాలేదు. డ్వాక్రా మహిళలు ఎవరూ బస్సు యాత్రకు వచ్చేందుకు ఆసక్తి చూపకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు బస్సులను ఖాళీగానే ఉంచి వెనక్కు తిప్పి పంపారు. ఓ వైపు పైన ఎండ, వడగాలులతో మహిళలు అల్లాడిపోయారు. సాయంత్రం 4.30 గంటలకు వచ్చిన బస్సు యాత్రం 4.45 గంటలకు ముగిసింది. ఇద్దరు నేతల ప్రసంగంతో ముగించారు. వేదికపై మంత్రులు తానేటి వనిత, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, విడుదల రజని, జోగి రమేష్, నగర మేయర్ కావటి శివనాగమనోహర్నాయుడు, ఎమ్మెల్యేలు ఎండీ ముస్తఫా, మద్దాళి గిరిధర్, కిలారి రోశయ్య, అన్నాబత్తుని శివకుమార్, మార్కెట్యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, డిప్యూటీ మేయర్లు సజీల, డైమండ్బాబు పలువురు నేతలున్నారు. బస్సు యాత్రకు చిలకలూరిపేట పట్టణంలోని ఏఎంజీ వద్ద వైసీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. అనంతరం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఏర్పాటుచేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం యాత్ర నరసరావుపేటకు చేరుకుంది. మంత్రులు విడదల రజని, జోగి రమేష్, ధర్మాన ప్రసాదరావు అంజద్ బాషా, రాజన్నదొర, అప్పలరాజు, ఆదిమూలపు సురేష్, నారాయణ స్వామి, బూడి ముత్యాలరావు, బొత్సా సత్యనారాయణ, తానేటి వనిత, మేరుగ నాగార్జున, ఉష చరణ్, గుమ్మనూరి జయరామ్, విశ్వరూప్, అంబటి రాంబాబు ప్రసంగించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మానాయుడు, నంబూరి శంకరరావు, ముస్తాఫా, ఎమ్మెల్సీలు, డొక్కా మాణిక్య వరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, లేళ్ళ అప్పిరెడ్డి, వేదికపై మంత్రులను సత్కరించారు.