175 సీట్లలో వైసీపీ పోటీ: కొడాలి నాని

ABN , First Publish Date - 2022-03-15T22:36:03+05:30 IST

రాష్ట్రంలోని 175 సీట్లలో ఒకేసారి పోటీ చేయగల సత్తా వైసీపీకి మాత్రమే

175 సీట్లలో వైసీపీ పోటీ: కొడాలి నాని

అమరావతి: రాష్ట్రంలోని 175 సీట్లలో ఒకేసారి పోటీ చేయగల సత్తా వైసీపీకి మాత్రమే ఉందని మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలో ఒకేసారి 160 సీట్లు పోటీ చేసే సత్తా ఏ ప్రతిపక్ష పార్టీకి లేదని ఆయన ఎద్దేవా చేశారు. గుంపులుగా పందుల తరహాలో ప్రతిపక్షాలన్నీ కలిసి 175 సీట్లు పంచుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. జగన్ అనే సింహం సింగిల్‌గానే పోటీ చేస్తుందని ఆయన అన్నారు. చావులను రాజకీయాలకు వాడుకుని రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. 60 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీలో సహజ మరణాలను కల్తీ సారా మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మృతి చెంది బాధల్లో ఉంటే ఎవరైనా ఆవేదనలోనే సమాధానం చెబుతారని ఆయన పేర్కొన్నారు. మూడో తేదీ నుంచి మృతి చెందినా, ఎవరూ ఫిర్యాదు చేయక పోయినా, మృతదేహాలను దహనం చేసేసిన తర్వాత ఈ తరహా ఆరోపణలను లేవదీశారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు దొరక్క కట్టుకథలు సృష్ఠించి ప్రభుత్వంపై ఆరోపణలు చేయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యను అవమానించారని శాసనసభకు చంద్రబాబు రాలేదని, కానీ ఆయన కుమారుడు లోకేష్ మాత్రం హాజరయ్యారని ఇదెక్కడి ద్వంద్వ విధానమని ఆయన ప్రశ్నించారు. గతంలో వైసీపీ ఛాలెంజ్ చేసి ప్రతిపక్ష పార్టీగా సభకు హాజరు కాలేదని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2022-03-15T22:36:03+05:30 IST