వైసీపీ బరితెగింపు
ABN , First Publish Date - 2022-07-01T08:20:22+05:30 IST
వైసీపీ బరితెగింపు
రెచ్చిపోతున్న అధికారపార్టీ నేతలు, అనుయాయులు
బాపట్ల జిల్లాలో పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు దారుడిపై దాడికి యత్నం
తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్పై దాడి
చీరాల, తాడిపత్రి, జూన్ 30: అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులు బరితెగిస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వ్యక్తిపై పోలీ్సస్టేషన్లోనే దాడికి యత్నించారు. బాపట్ల జిల్లా చినంగంజాం పోలీ్సస్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మాజీ ఎంపీపీ(కాంగ్రెస్) రమణారెడ్డి అనుమతులు పొందిన సాల్ట్ భూముల నుంచి ఇసుక, మట్టిని తరలించే క్రమంలో బుధవారం వైసీపీ నేత అంకమ్మరెడ్డి, బ్రహ్మారెడ్డి, వారి అనుచరులు దౌర్జన్యం చేశారు. రమణారెడ్డి ట్రాక్టర్ను అటకాయించారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. దీనిపై రమణారెడ్డి గురువారం చినగంజాం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న అంకమ్మరెడ్డి, ఆయన అనుచరులు పోలీ్సస్టేషన్కు వచ్చి అక్కడే రమణారెడ్డిపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు రమణారెడ్డిని స్టేషన్ లోపలకు పంపించి, వైసీపీ నేతలను బయటికి పంపించేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే దాడికి యత్నించడంపై చర్యలు చేపట్టకపోవటం గమనార్హం.
దాడిపై ఫిర్యాదు చేయం: జేసీ ప్రభాకర్రెడ్డి
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ 26వ వార్డు కౌన్సిలర్ షెక్షావలి (టీడీపీ)పై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. మున్సిపల్ కార్యాలయం నుంచి బైక్పై ఇంటికి వెళుతుండగా ద్విచక్ర వాహనాలపై వచ్చిన వైసీపీ అల్లరిమూకలు తనను అడ్డగించి దాడిచేసి, పారిపోయాయని షేక్షావలి తెలిపారు. దాడిలో తన కళ్లద్దాలు కూడా పగిలిపోయాయన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటికి వెళ్లి దాడి గురించి తెలియజేశారు. ఇలాంటి దాడులకు భయపడాల్సిన అవసరం లేదని, అండగా ఉంటానని ఆయనకు ప్రభాకర్రెడ్డి భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే షెక్షావలి.. అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంటారు. విలేకరుల సమావేశాల్లోనూ స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డిని, ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు. ఈ కారణంగానే దాడి జరిగినట్లు భావిస్తున్నారు. వైసీపీ వర్గీయులపై కేసు నమోదుచేస్తారన్న నమ్మకం లేక, ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తెలిపారు.