వైసీపీకి పతనం తప్పదు
ABN , First Publish Date - 2021-01-25T05:35:49+05:30 IST
టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, పత్తికొండ టీడీపీ ఇన్చార్జి కేఈ శ్యాంబాబులపై అక్రమ కేసులు పెట్టిన వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వలసల రామక్రిష్ణ, అమకతాడు వీరభద్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- కోట్ల, కేఈలపై కేసులు పెట్టడం అన్యాయం
- టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామక్రిష్ణ
డోన్, జనవరి 24: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, పత్తికొండ టీడీపీ ఇన్చార్జి కేఈ శ్యాంబాబులపై అక్రమ కేసులు పెట్టిన వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వలసల రామక్రిష్ణ, అమకతాడు వీరభద్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం డోన్లో వారు విలేకరులతో మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని టీడీపీ నాయకులపై వెల్దుర్తి పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం చాలా అన్యాయమన్నారు. కోట్ల సూర్యప్రకా్షరెడ్డి, కేఈ శ్యాంబాబులు టీడీపీ కార్యకర్తలతో సమావేశమైతే కొవిడ్ నిబంధనలు ఎలా ఉల్లంఘించినట్లవుతుందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టా ల పంపిణీ పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు హంగామా చేయడం కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం కాదా? అని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకుల గొంతు నొక్కాలని చూస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఉడుములపాడు ప్రవీణ్కుమార్ రెడ్డి, నాగేంద్ర పాల్గొన్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పత్తికొండ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి కేఈ శ్యాంబాబులపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేయడం అన్యాయమని తెలుగు మహి ళా కర్నూలు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి సుకన్యాదేవి అన్నారు. ఆదివారం నగరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కూడా సీఎం జగన్ మాస్కు ధరించిన పాపాన పో లేదన్నారు. అదేవిధంగా జగన్ పాదయాత్ర రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ నేతలు ఇటీవల వేలాది మందితో పాదయాత్రలు చేశారని, ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా వేలాది మందితో సభలు పెట్టారని, అప్పుడు కొవిడ్ నిబంధనలు లేవా? అని ప్రశ్నించారు. కొవిడ్ నిబంధనలు కేవలం ప్రతిపక్ష నేతలకే వర్తిస్తాయా.? అని పోలీసు అధికారులను ప్రశ్నించారు. గతంలో తమ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వరద బాధిత ప్రాంతాల్లో నష్టపోయిన ప్రజలను పరామర్శించడానికి రాష్ట్రంలో పర్యటిస్తే.. ఆయనపై కూడా కొవిడ్ నిబఽంధనలు ఉల్లంఘించారని కేసు పెట్టారని అన్నారు.
క్రిష్ణగిరి: కొవిడ్ నిబంధనలు పాటించలేదని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి, పత్తికొండ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శ్యాంబాబులపై పోలీసులు కేసు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య అని పత్తికొండ టీడీపీ నియోజకవర్గ లీగల్ కన్వీనర్ మాదాపురం ఎల్వీ ప్రసాద్ అన్నారు. ఆదివారం విలేఖరులతో మాట్లాడుతు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కొవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రజల కోసం నాడు - ప్రజలతో నేడు, ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాలలో ఊరూర తిరిగారని, సమావేశాలు, సభలు పెటర్టారని అప్పుడు కొవిడ్ నిబంధనలు వైసీపీ నాయకులకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాదాపురం దస్తగిరి,అమకతాడు సుదాకర్, శేఖర్, రమే్ష, బోయ గురుస్వామి పాల్గొన్నారు.
తుగ్గలి: టీడీపీ నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు తిరుపాలునాయుడు, ఉపాధ్యక్షుడు వెంకటరాముడు చౌదరి డిమాండ్ చేశారు. ఆదివారం వారు విలేఖర్లతో మాట్లాడుతూ వెల్దుర్తిలో నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టీడీజీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకా్షరెడ్డి, పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శ్యాంబాబులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలన్నారు.