పాతపట్నంలో దువ్వాడ అనుచరుల హల్చల్
ABN , First Publish Date - 2021-03-01T09:37:53+05:30 IST
వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు ఆదివారం పాతపట్నంలో హల్చల్ చేశారు. దువ్వాడను వైసీపీ అధిష్ఠానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా
పాతపట్నం, ఫిబ్రవరి 28: వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు ఆదివారం పాతపట్నంలో హల్చల్ చేశారు. దువ్వాడను వైసీపీ అధిష్ఠానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన అనుచరులు ఆదివారం స్థానిక నీలమణి దుర్గ ఆలయంలో మొక్కులు చెల్లించేందుకు వచ్చారు. అందులో కొందరు ఆలయ సమీపంలోని మామిడి తోటలో మద్యం తాగుతుండగా స్థానికులు ప్రశ్నించారు. భక్తులు వంటలు చేసుకునే ప్రాంతంలో మద్యం తాగొద్దని సూచించారు. దీనిపై వారిమధ్య వివాదం తలెత్తడంతో స్థానికులపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఓ యువతి గాయపడగా.. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.