జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన వైసీపీ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2022-03-17T23:16:02+05:30 IST

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలంటే ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు దాన్ని పూర్తిగా మరిచిపోయారు.

జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన వైసీపీ ఎమ్మెల్యేలు

అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలంటే ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు దాన్ని పూర్తిగా మరిచిపోయారు. బడ్జెట్‌పై చర్చించకుండా సీఎ జగన్‌ను పోగిడేందుకే సమయాన్ని కేటాయించారు. ఒకరిని మంచి మరొకరు పోటీ పడతూ జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఇది చూసిన జగన్ ముసిముసినవ్వులు చిందిస్తూ తెగ ఎంజాయ్ చేశారు. బీసీ సంక్షేమంపై చర్చ సందర్భంగా సీఎంను స్తుతిస్తూ.. విపక్షాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. పేదలకు రికార్డు స్థాయిలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన జగన్‌ను గిన్నీస్ బుక్‌లో ఎక్కించాలని ఎమ్మెల్యే పార్ధసారథి పొగడ్తల దండకం అందుకున్నారు. ఇక తామేమి తక్కువ తిన్నామా అన్నట్లు పొగడ్తల వర్షాన్ని మరో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అందుకున్నారు. బీసీ కుటుంబాల్లో కొందరు పెద్ద కొడుకులా.. మరికొందరికి తమ్ముడిగా ఇంకొందరు మనవడిగా సీఎంను చూసుకుంటున్నారని ఆకాశానికి ఎత్తేశారు. 


ఈ ఇద్దరికి తానేమీ తీసిపోను అన్నట్లు ఎమ్మెల్యే రజని.. జగన్‌ను పొగడడానికి ఏకంగా జాతీయ, అంతర్జాతీయ రిపోర్టులంటూ కొన్నింటిని సభలో ప్రస్తావించారు. పలానికి ఓ పొగడ్తా... వ్యాఖ్యానికో సూక్తితో ఎమ్మెల్యేలు, జగన్ భజన చేశారు. ఈ పొగడ్తలతో మునిగి తబ్బిబ్బవుతూ చప్పట్లోతో ఎమ్మెల్యేలను జగన్ ఉత్తేజపరిచారు. దీంతో సభాసమయం మూడు పొగడ్తలు.. ఆరు చప్పట్లతో ముగిసింది. ప్రజాసమస్యలు చర్చించాల్సిన చోట జగన్‌పై భక్తి పూజ ప్రదర్శించారు. వారిని గెలిపించిన పేదల శ్రేయస్సును మరిచారు. ఇంద్రుడూ... చంద్రుడూ అంటూ జగన్‌ను ఎమ్మెల్యేలు ఆకాశానికి ఎత్తేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2022-03-17T23:16:02+05:30 IST