వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం: విజయసాయిరెడ్డి
ABN , First Publish Date - 2022-02-01T01:53:49+05:30 IST
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలైన వైజాగ్ స్టీల్ ప్లాంట్తో పాటు ఎల్ఐసీ, బీపీసీఎల్
ఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలైన వైజాగ్ స్టీల్ ప్లాంట్తో పాటు ఎల్ఐసీ, బీపీసీఎల్ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. అఖిలపక్ష సమావేశానికి వర్చువల్గా ఆయన హాజరై మాట్లడారు. సీఎం జగన్ ఇటీవల ప్రధానమంత్రికి ఇచ్చిన వినతి పత్రంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సమావేశాలు అడ్డుకునే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సమావేశంలో చెప్పామన్నారు. పెగాసెస్ వ్యవహారం సామాన్య ప్రజలకు సంబంధించింది కాదన్నారు.
కరోనా నేపథ్యంలో రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారాన్ని మరో ఐదేళ్ళ పాటు పొడగించాలని ఆయన డిమాండ్ చేశారు. మధ్యతరగతి ప్రజలకు స్వల్ప మొత్తంతో ఆరోగ్య బీమాను వర్తింపజేయాలన్నారు. తక్షణమే జనాభా లెక్కల సేకరణ చేపట్టాలని, అందులో కులాల వారి గణన కూడా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలలో 10 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన కోరారు. నిర్ణీత కాల వ్యవధిలో నియామకాలు పూర్తి చేసేలా యూపీఎస్సీ తరహాలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ , ఆర్ఆర్బీకీ సైతం చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.