పేదలందరికీ సంక్షేమ ఫలాలు

ABN , First Publish Date - 2022-06-28T03:18:31+05:30 IST

దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఏపీలో జరిగిందని, పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

పేదలందరికీ సంక్షేమ ఫలాలు
మాట్లాడుతున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

ఉదయగిరి, జూన్‌ 27: దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఏపీలో జరిగిందని, పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగి నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే శక్తి వైసీపీకే ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను వైసీపీ శ్రేణులు తిప్పి కొట్టాలన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా సీఎం జగన్‌ చర్యలు తీసుకొంటున్నారన్నారు. 2024 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించాలని, ఆ దిశగా కార్యకర్తలు, నాయకులు పని చేయాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తన అన్న రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం ఆరుణమ్మ, ప్లీనరి సమావేశం ఇన్‌చార్జి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, ప్రచార కార్యదర్శి శాంతకుమారి, కో ఆప్షన్‌ సభ్యులు తాజుద్దీన్‌, కన్వీనర్‌ అక్కి భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ గొల్లపల్లి తిరుపతి, శాంతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T03:18:31+05:30 IST